Play all audios:
EaseMyTrip vs MakeMyTrip: మేక్మైట్రిప్పై ఈజ్మైట్రిప్ వ్యవస్థాపకుడు నిశాంత్ పిట్టీ తీవ్ర ఆరోపణలు చేశారు. ఆ సంస్థ బోర్డులో చైనా వ్యక్తులు ఉన్నారని ఆరోపించారు. EaseMyTrip vs MakeMyTrip |
దిల్లీ: భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతల వేళ కొన్ని దేశాల నిజస్వరూపం బయటపడింది. ముఖ్యంగా తుర్కియే, అజర్బైజాన్ దేశాలపై దేశవ్యాప్తంగా బాయ్కాట్ ట్రెండ్ నడుస్తోంది. ఆయా దేశాల ఉత్పత్తులు
బహిష్కరించడంతో పాటు ఆ దేశాలకు పర్యటనలను కూడా ఉపసంహరించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈజ్మైట్రిప్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ నిశాంత్ పిట్టీ తన ప్రత్యర్థి మేక్మైట్రిప్పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఆ
సంస్థ 10 మంది డైరెక్టర్ల బోర్డులో ఐదుగురు చైనా వ్యక్తులని ఆరోపించారు. ఈ మేరకు ఎక్స్లో పోస్ట్ చేశారు. బాయ్కాట్ ట్రెండ్ ప్రారంభమైన వేళ తొలుత నిశాంత్ బుధవారం ఎక్స్ వేదికగా ఓ పోస్ట్
పెట్టారు. ‘‘చైనా యాజమాన్యంలోని ఓ ప్లాట్ఫామ్ ద్వారా భారత సాయుధ దళాలు డిస్కౌంట్ టికెట్లను బుక్ చేసుకుంటున్నారు. డిఫెన్స్ ఐడీ, రూట్, తేదీ వంటి వివరాలను అందిస్తున్నారు. దీనివల్ల మన
శత్రువులకు మన సైనికులు ఎక్కడికి వెళుతున్నారో తెలుస్తోంది. ఈ లూప్హోల్ను వెంటనే సరిదిద్దాలి’’ అని నిశాంత్ పోస్ట్ చేశారు. అందులో మేక్ మై ట్రిప్ పేరును ఎక్కడా ప్రస్తావించకుండా సంబంధిత
స్క్రీన్షాట్లను మాత్రమే పోస్ట్ చేశారు. ఈ ఆరోపణలను మేక్మైట్రిప్ ఖండించింది. తమది భారతీయ కంపెనీ అని, ఇక్కడి చట్టాలకు లోబడి పనిచేస్తున్నామని వివరణ ఇచ్చింది. డేటా ప్రైవసీ చట్టాలకు కట్టుబడి
ఉన్నామని తెలిపింది. తమపై వస్తున్న ఆరోపణలు ఉద్దేశపూర్వకంగా చేస్తున్నవిగా ఆ సంస్థ ప్రతినిధి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నిశాంత్ తాజాగా మరో పోస్ట్ చేశారు. ఈ సారి నేరుగా మేక్మైట్రిప్ పేరును
ప్రస్తావిస్తూ.. బోర్డులోని 10 మందిలో ఐదుగురికి చైనాతో సంబంధాలు ఉన్నాయని తెలిపారు. నాలుగు వ్యూహాత్మక బోర్డు కమిటీల్లో మూడు చైనీస్ అనుబంధం కలిగిన డైరెక్టర్లు నాయకత్వం వహిస్తున్నారని
ఆరోపించారు. చైనా వ్యక్తులు డైరెక్టర్లుగా ఉన్న స్క్రీన్ షాట్లను పోస్ట్ చేశారు. మే 14న కొత్త డైరెక్టర్ నియామకం చేపట్టినంత మాత్రన చైనా మూలాలను చెరిపేయలేరంటూ తప్పుబట్టారు. జాతీయ భద్రత
విషయంలో మౌనం తగదని నిశాంత్ వ్యాఖ్యానించారు. తాజా ఆరోపణలపై మేక్ మై ట్రిప్ స్పందించలేదు.