Play all audios:
ఇంటర్నెట్డెస్క్: రక్షణ రంగంలోని ప్రధాన కాంట్రాక్టులపై సంతకాలు జరుగుతాయి కానీ.. డెలివరీలు మాత్రం మొదలుకావని వాయుసేన అధిపతి ఎయిర్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
సీఐఐ వార్షిక సమావేశంలో ఆయన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సమక్షంలోనే ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘చాలా సార్లు కాంట్రాక్టులపై సంతకాలు జరగుతాయి.. కానీ, సిస్టమ్స్ (ఆయుధాలు) మాత్రం ఎప్పటికీ అందవు.
టైమ్లైన్ ప్రధాన సమస్య. సకాలంలో పూర్తయిన ఒక్క ప్రాజెక్టు కూడా నాకు గుర్తుకురావడంలేదు. మనం చేయలేని పనికి ఎందుకు వాగ్దానాలు చేయడం? తేజస్ ఎంకే1 చాలా ఆలస్యమైంది. ఇక తేజస్ ఎంకే2 ప్రొటోటైప్
కూడా అందుబాటులోకి రాలేదు. ఇక ఆమ్కా ఫైటర్కు సంబంధించి ఇప్పటి వరకు నమూనా విమానం కూడా రాలేదు. మన దళాలు.. పరిశ్రమ మధ్య విశ్వాసం పెరగాల్సిన అవసరం ఉంది. పారదర్శకత చాలా అవసరం. మనం ఒక్కసారి
దేనికైనా కట్టుబడితే.. దానిని అందించి తీరాల్సిందే. మేకిన్ ఇండియా కోసం వాయుసేన శక్తివంచన లేకుండా కృషి చేస్తోంది. మనం ఈ రోజు సంసిద్ధంగా ఉంటేనే.. భవిష్యత్తుకు సన్నద్ధం కాగలము. రానున్న
పదేళ్లలో.. మన పరిశ్రమలు ఉత్పత్తిని గణనీయంగా పెంచగలవు. కానీ, ప్రస్తుతానికి మనం త్వరగా చర్యలు తీసుకోవడం అవసరం. దళాలను శక్తిమంతం చేసుకొంటేనే యుద్ధాలు గెలుస్తాం’’ అని పేర్కొన్నారు. యుద్ధ రంగం
వేగంగా మారిపోతోంది..! యుద్ధ రంగంలో వేగంగా మారిపోతున్న సాంకేతికతలను అందిపుచ్చుకోవాలని ఎయిర్ మార్షల్ ఏపీ సింగ్ సూచించారు. ‘‘మన నౌకాదళాధిపతి చెప్పినట్లు యుద్ధ రంగం వేగంగా మారిపోతోంది. ప్రతి
రోజు సరికొత్త టెక్నాలజీలు అందుబాటులోకి వస్తున్నట్లు చూస్తున్నాం. ఆపరేషన్ సిందూర్తో.. మనం ఎక్కడ ఉన్నాం.. భవిష్యత్తుకు ఏం కావాలనే దానిపై స్పష్టమైన అవగాహన వచ్చింది. మనం చేయాల్సింది చాలా ఉంది.
ఆమ్కా ప్రాజెక్టును ప్రైవేటు సెక్టార్ కోసం కూడా క్లియర్ చేశారు. ఇది చాలా పెద్ద నిర్ణయం. మన ప్రైవేటు రంగంపై దేశానికి ఆ స్థాయిలో విశ్వాసం ఉంది. భవిష్యత్తులో భారీ మార్పులకు ఇది బాటలు
పరుస్తుంది’’ అని పేర్కొన్నారు. ఈ ఏడాది జనవరిలో కూడా వాయుసేనాధిపతి తేజస్ డెలివరీలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.‘‘తయారీ సంస్థలు ఉత్పత్తి వేగం పెంచడానికి అత్యాధునిక వ్యవస్థలపై
పెట్టుబడులు పెట్టాలి. వారి మానవ వనరుల నైపుణ్యాలకు మెరుగులు దిద్దాలి. తేజస్ తొలి ఎయిర్ క్రాఫ్ట్ 2001లోనే గాల్లోకి ఎగిరింది. 2016 నుంచి ఇప్పటి వరకు తొలి 40 విమానాల డెలివరీ కూడా
పూర్తికాలేదు’’ అని నాడు ఆయన వ్యాఖ్యానించడం సంచలనం సృష్టించింది.