Play all audios:
ఇంటర్నెట్ డెస్క్: ‘ఆపరేషన్ సిందూర్’ నేపథ్యంలో జమ్మూలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. భారత్ మెరుపు దాడులతో బిక్కచచ్చిన పాకిస్థాన్.. తన ఉనికిని చాటుకొనేందుకు ప్రయత్నిస్తోంది. జమ్మూ
లక్ష్యంగా దాడులకు తెగబడుతోంది. అయితే, సర్వసన్నద్ధంగా ఉన్న భారత సైన్యం పాక్ దాడుల్ని తిప్పికొడుతోంది. సత్వారీ, సాంబా, ఆర్ఎస్ పురా, ఆర్నియా సెక్టార్లలో పాక్ క్షిపణి దాడులకు పాల్పడింది.
పాక్ ప్రయోగించిన ఎనిమిది మిసైల్స్ను భారత సైన్యం వీరోచితంగా కూల్చేసింది. అఖ్నూర్, కిష్త్వార్, సాంబా సెక్టార్లో అధికారులు పూర్తిగా విద్యుత్ సరఫరా నిలిపివేశారు. జమ్మూ జిల్లా వ్యాప్తంగా
సైరన్లు మోగిస్తున్నారు. ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని సైన్యం హెచ్చరికలు జారీ చేసింది. సరిహద్దు రాష్ట్రాల్లోని పలు నగరాల్లో బ్లాక్అవుట్ పాటించారు. జమ్మూతో సహా పఠాన్కోట్, ఉధమ్పుర్లలో ఈ
దాడులు జరుగుతున్నట్లు సమాచారం. మరోవైపు సాంబా జిల్లాలో పాక్ రేంజర్లు కాల్పులకు తెగబడుతున్నట్లు సమాచారం. పలుచోట్ల భారీగా శబ్దాలు వినిపిస్తున్నాయి. అఖ్నూర్ సెక్టార్ సహా పలు ప్రాంతాల్లో
సైరన్లు మోగుతున్నాయి. ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని సైన్యం హెచ్చరికలు జారీచేసింది. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో జమ్మూ, కుప్వారా సహా పలుచోట్ల కరెంటు నిలిపివేశారు. మరోవైపు, పాక్ దాడులను భారత
సైన్యం తిప్పికొడుతోంది. గగనతల రక్షణ వ్యవస్థలతో డ్రోన్ దాడులను నిర్వీర్యం చేస్తోంది. జమ్మూ యూనివర్సిటీకి సమీపంలో రెండు డ్రోన్లను ధ్వంసం చేసినట్లు సమాచారం. జమ్మూకశ్మీర్, పంజాబ్లో
హైఅలర్ట్.. భారత్-పాక్లో తాజాగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల వేళ జైషే మహ్మద్, లష్కరే తొయ్యిబా ఉగ్రసంస్థలు భద్రతా దళాలపై ఆత్మాహుతి దాడులకు పాల్పడవచ్చని నిఘా వర్గాలు అంచనా వేశాయి. దీంతో
జమ్మూకశ్మీర్, పంజాబ్ రాష్ట్రాల్లో హైఅలర్ట్ జారీ చేశారు. దీంతో ఆయా రాష్ట్రాల్లోని ఆలయాలు, నీటి ప్రాజెక్టుల్ని అప్రమత్తం చేశారు. ఈ జిల్లాలో కరెంట్ బంద్ పంజాబ్లోని గుర్దాస్పుర్
జిల్లాలో రాత్రిపూట విద్యుత్ నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ‘‘గుర్దాస్పుర్ జిల్లా వ్యాప్తంగా రాత్రి 9గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 5గంటల వరకు
పూర్తిగా కరెంటు నిలిపివేయాలి. ఆసుపత్రులు, సెంట్రల్ జైళ్లకు వీటి నుంచి మినహాయింపు ఉంది. అయినప్పటికీ నిర్దేశించిన సమయంలో జైలు, ఆసుపత్రుల కిటికీలు మాత్రం కచ్చితంగా మూసి ఉంచాలి. అత్యవసర
పరిస్థితులు ఎదుర్కోవడంలో భాగంగా ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఇవి అమల్లో ఉంటాయి’’ అని ప్రభుత్వం ప్రకటనలో పేర్కొంది. ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తితే ఎదుర్కొనేందుకు
వీలుగా ఈ చర్యలు తీసుకున్నట్లు సమాచారం.