Play all audios:
ప్రపంచ ఛాంపియన్ దొమ్మరాజు గుకేశ్ నార్వే చెస్ టోర్నీలో ప్రపంచ నంబర్ వన్ మాగ్నస్ కార్ల్సన్ను ఓడించాడు. దీంతో ఓటమి ఆవేదనతో కార్ల్సన్ పిడికిలి బిగించి చెస్ బోర్డ్పై ఆవేశంగా కొట్టాడు.
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచ ఛాంపియన్ దొమ్మరాజు గుకేశ్ (Gukesh Dommaraju) నార్వే చెస్ టోర్నీలో ప్రపంచ నంబర్ వన్ మాగ్నస్ కార్ల్సన్ (Magnus Carlsen)ను ఓడించాడు. క్లాసికల్ చెస్
పోటీలో కార్ల్సన్ను ఓడించడం గుకేశ్కు ఇదే తొలిసారి. అంతేకాకుండా ఈ విజయంతో తొలిరౌండ్లో ఓటమికి గుకేశ్ ప్రతీకారం తీర్చుకున్నట్లు అయింది. ఓటమిని తట్టుకోలేక కార్ల్సన్ పిడికిలితో ఒక్కసారిగా
చెస్బోర్డు టేబుల్ను గట్టిగా కొట్టాడు. అనంతరం గుకేశ్కు రెండు సార్లు సారీ చెప్పి వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయాడు. మరోవైపు చెస్ చరిత్రలోనే మేటి ఆటగాడిని ఓడించడంతో గుకేశ్ కొన్నిసెకన్ల పాటు
షాక్లోనే ఉండిపోయాడు. ప్రస్తుతం దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. నార్వే చెస్ టోర్నీలో భాగంగా ఆరో రౌండ్లో నల్ల పావులతో బరిలోకి దిగిన గుకేశ్ తీవ్ర ఒత్తిడిలోనూ
అద్భుతంగా నిలబడ్డాడు. కార్ల్సన్ ఇచ్చిన తప్పిదాన్ని ఒడిసిపట్టుకున్న ప్రపంచ నంబర్ 3 గుకేశ్.. ప్రపంచ నంబర్వన్ను కంగుతినిపించాడు. సొంతవేదికగపై మాగ్నస్.. మ్యాచ్ ఆద్యంతం పైచేయి
సాధించినప్పటికీ.. ఒత్తిడిని చిత్తుచేస్తూ గుకేశ్ తొలుత రక్షణాత్మకంగా ఆడి చివరలో ప్రత్యర్థిని బోల్తాకొట్టించాడు. గతేడాది ఇదే టోర్నీలో కార్ల్సన్ను మరో భారత స్టార్ ప్రజ్ఞానంద ఓడించాడు.
మరోవైపు నార్వే చెస్ టోర్నీలో భారత గ్రాండ్ మాస్టర్ అర్జున్ ఇరిగేశి.. ప్రపంచ నంబర్ 2 హికరు నకముర (అమెరికా)ను ఓడించాడు. ప్రస్తుతం కార్ల్సన్ ఆరు రౌండ్లలో రెండు విజయాలు, ఒక పరాజయం, మూడు
డ్రాలతో మొత్తం 9.5 పాయింట్ల టాప్ 1గా ఉన్నాడు. రెండో స్థానంలో ఫాబియానో కరువానా ఉన్నారు. మూడో స్థానంలోకి గుకేశ్ వచ్చాడు.