Play all audios:
ఇంటర్నెట్ డెస్క్: పాకిస్థాన్కు (Pakistan) 1 బిలియన్ డాలర్ల నిధులు (దాదాపు రూ.8,540 కోట్లు) మంజూరుకు అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ నిధులను మంజూరు చేయడానికి
ఐఎంఎఫ్ పలు షరతులు విధించింది. అంతే కాకుండా భారత్తో ఉద్రిక్తతలు ఇంకా పెంచుకోవడం వల్ల పాక్కే ఎక్కువ సమస్యలు వస్తాయని చురకలు అంటించింది. ఈ ఘర్షణలు దేశంలో ఆర్థిక, బాహ్య సంస్కరణల లక్ష్యాలకు
ముప్పు కలిగిస్తాయని హెచ్చరించింది. ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతల వల్ల స్టాక్ మార్కెట్ మొదట నష్టాల్లోకి వెళ్లినప్పటికీ..ప్రస్తుతం స్థిరంగా ఉన్నాయని ఐఎంఎఫ్ నివేదికలు పేర్కొన్నాయి. ఐఎంఎఫ్
ఇస్తున్న నిధులను పాక్ అభివృద్ధికి కాకుండా ఉగ్రవాదులను పోషించడానికి వినియోగిస్తోందని భారత్ ఇటీవల ఆరోపించింది. ఆపరేషన్ సిందూర్లో (Operation Sindoor) ధ్వంసమైన ఉగ్రవాద స్థావరాలను
పునర్నిర్మించడానికి జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్కు రూ.14 కోట్ల ఇస్తున్నట్లు పాక్ ప్రభుత్వం ప్రకటించిందని పేర్కొంది. పాక్కు నిధులు మంజూరు చేస్తే పరోక్షంగా ఉగ్రవాదాన్ని
ప్రోత్సహించినట్లే అవుతుందని.. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఐఎంఎఫ్ పాక్కు నిధులు సమకూర్చడంపై పునరాలోచించాలని మోదీ ప్రభుత్వం కోరినప్పటికీ.. అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) నుంచి పాక్కు 1
బిలియన్ డాలర్ల నిధులు (దాదాపు రూ.8,540 కోట్లు) మంజూరయ్యాయి. ఎక్స్టెండెడ్ ఫండ్ ఫెసిలిటీ (EFF) కింద ఈ మొత్తాన్ని ఇవ్వడానికి ఐఎంఎఫ్ ఆమోదం తెలిపింది.