Play all audios:
ఇంటర్నెట్ డెస్క్: పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’తో తోకముడిచినప్పటికీ.. పాకిస్థాన్ (Pakistan) బుద్ధి మాత్రం మారలేదు. ప్రగల్భాలు పలుకుతూ మళ్లీ మళ్లీ
నవ్వులపాలు అవుతోంది. ఇప్పుడా దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్.. భారత ప్రధాని నరేంద్రమోదీ చర్యలను కాపీ కొట్టడంతో మీమర్లకు దొరికిపోయారు. సియాల్కోట్లోని ఆర్మీబేస్ను షెహబాజ్ (Shehbaz Sharif)
సందర్శించడంపై నెట్టింట విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలేం జరిగిందంటే.. భారత ప్రధాని మోదీ (PM Modi) మంగళవారం పంజాబ్లోని ఆదంపుర్ ఎయిర్బేస్ను సందర్శించిన సంగతి తెలిసిందే. అక్కడి సైనికులతో
ముచ్చటించిన ఆయన.. ఆపరేషన్ సిందూర్లో మన దళాల సేవలను కొనియాడారు. అదే సమయంలో దాయాదికి గట్టి హెచ్చరికలు చేశారు. కాగా.. ఆ మరుసటి రోజు అంటే బుధవారం పాక్ ప్రధాని షెహబాజ్.. సియాల్కోట్లోని
పస్పూర్ కంటోన్మెంట్ను సందర్శించారు. భారత్ దాడుల్లో ధ్వంసమైన తమ ఆర్మీ స్థావరాన్ని పరిశీలించారు. సైనికులతో మాట్లాడారు. * ఆదంపుర్.. ఉక్కుడేగల గూడు..: పశ్చిమ సరిహద్దుకు ఎస్-400 రక్షణ ఛత్రం
ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. దీంతో షెహబాజ్పై జోకులు పేలుతున్నాయి. అచ్చం మోదీని కాపీకొట్టారంటూ పలువురు నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు
గుప్పిస్తున్నారు. ‘‘భారత్ చేతిలో ఓడిపోయినా.. పాక్ సంబరాలు చేసుకుంటోంది’’ అని ఎద్దేవా చేస్తున్నారు. ఓడిపోతే కూడా స్వీట్లు పంచుకుంటారా? అని చురుకలంటిస్తున్నారు. కాగా.. పాక్ ఇలా భారత్ను కాపీ
చేయడం ఇదే తొలిసారి కాదు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలో న్యూదిల్లీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పాక్ జాతీయులకు వీసాల రద్దు, ఆ దేశ హైకమిషన్ కార్యాలయంలో
దౌత్య సిబ్బంది తగ్గింపు, అటారీ సరిహద్దు మూసివేత వంటివి ప్రకటించింది. ఆ తర్వాత కొద్ది రోజులకే పాక్ కూడా అచ్చం ఇలాంటి చర్యలే ప్రకటించింది. వాఘా బోర్డర్ను మూసివేస్తున్నామని, భారత
దౌత్యసిబ్బందిని తగ్గిస్తున్నామని, భారత జాతీయులకు అనుమతులతో పాటు, ఇతర వీసాలను రద్దు చేస్తున్నామని వెల్లడించింది. అప్పట్లోనూ దీనిపై పాక్పై ట్రోల్స్ పేలిపోయాయి.