Play all audios:
న్యూయార్క్: ‘ఆపరేషన్ సిందూర్’లో (Operation Sindoor) భాగంగా పాకిస్థాన్లోని ఉగ్ర స్థావరాలపై భారత్ దాడులు చేపట్టిన నేపథ్యంలో అక్కడ ఉన్న తమ పౌరులకు అమెరికా (US) రాయబార కార్యాలయం పలు
హెచ్చరికలు జారీ చేసింది. సాయుధ దళాల సంఘర్షణకు అవకాశం ఉన్నందున భారత్-పాక్ నియంత్రణ రేఖకు సమీపంలో ఉన్న ప్రాంతాలకు ప్రయాణాలు చేయొద్దని సూచించింది. ఇరుదేశాల గగనతలాల మూసివేత, పాక్లోని
పరిస్థితిని ఎప్పటికప్పుడు తాము నిశితంగా గమనిస్తున్నామని వెల్లడించింది. పాక్లో దాడులు జరిగిన ప్రాంతాలకు సమీపంగా ఉన్నవారు సురక్షిత ప్రాంతాలకు వెళ్లి ఆశ్రయం పొందాలని.. అమెరికా అడ్వైజరీ
సూచించింది. ఆయా ప్రాంతాలకు వెళ్లాలనుకునేవారు తమ ప్రయాణాలను రద్దు చేసుకోవాలని సూచించింది. * ‘ఆపరేషన్ సిందూర్’.. అంతర్జాతీయ మీడియా ఎలా స్పందించిందంటే..? కాగా పాక్లోని ఉగ్ర స్థావరాలపై దాడుల
విషయంపై అమెరికా ఇప్పటికే స్పందించింది. ఈ ఘర్షణకు వీలైనంత త్వరగా ముగింపు పలకాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేర్కొన్నారు. రెండు శక్తిమంతమైన దేశాల మధ్య యుద్ధం ఎవరూ కోరుకోరని.. భారత్, పాక్లకు
ఎంతో చరిత్ర ఉందని అన్నారు. వీటి మధ్య ఎన్నో ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ.. ప్రపంచానికి శాంతి మాత్రమే కావాలని, ఘర్షణలు వద్దని అన్నారు. యూఎస్లోని భారత రాయబార కార్యాలయం మాట్లాడుతూ..‘‘ఆధారాలు,
సాంకేతిక సమాచారం, అక్కడి నుంచి ప్రాణాలతో బయటపడిన వారి సాక్ష్యం ఆధారంగా భారత్.. పాకిస్థాన్లోని ఉగ్ర స్థావరాలపై దాడులకు పాల్పడినట్లు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. ఈ దాడిలో అక్కడి పౌర, ఆర్థిక,
సైనిక లక్ష్యాల జోలికి భారత్ వెళ్లలేదు. కేవలం ఉగ్రవాద శిబిరాలే లక్ష్యంగా దాడులు జరిగాయి’’ అని పేర్కొంది. మరోవైపు ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో భారత రాయబారికి పాక్ సమన్లు జారీ చేసినట్లు
అధికారులు పేర్కొన్నారు.