Play all audios:
దిల్లీ: జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ వచ్చేవారం రష్యాలో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. మే 27 నుంచి 29 వరకు భద్రతా వ్యవహారాల ఉన్నతస్థాయి ప్రతినిధుల 13వ అంతర్జాతీయ సమావేశం జరగనుంది.
ఇందులో పాల్గొనేందుకు డోభాల్ (Ajit Doval) మాస్కోకు వెళ్లనున్నట్లు సమాచారం. ఇదే పర్యటనలో ఆయన రష్యా (Russia) వద్ద పెండింగ్లో ఉన్న ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థల ముందస్తు డెలివరీ అంశంపై
చర్చించనున్నారట. ఈమేరకు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ పలు ఆంగ్ల మీడియా కథనాలు వెల్లడించాయి. ‘ఆపరేషన్ సిందూర్’తో భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న వేళ డోభాల్ పర్యటన ప్రాధాన్యం
సంతరించుకుంది. ఇటీవల ‘ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor)’ సమయంలో మన ఎస్-400 కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. వైమానిక, క్షిపణి దాడులకు దిగితే నిలువరించే అత్యంత శక్తిమంతమైన ఆయుధ
వ్యవస్థ ఎస్-400. శత్రువుల యుద్ధ విమానాలు, డ్రోన్లు, క్రూజ్ క్షిపణులు, బాలిస్టిక్ క్షిపణులను అత్యంత కచ్చితత్వంతో నేలకూల్చగలదు. ప్రత్యర్థి జామింగ్ విధానాలను కూడా తట్టుకోగలదు. వీటిని
రష్యాకు చెందిన ఎన్పీవో అల్మాజ్ సంస్థ అభివృద్ధి చేసింది. మొత్తం ఐదు ఎస్-400 క్షిపణి వ్యవస్థలను కొనుగోలు చేసేందుకు 2018లో భారత్-రష్యా మధ్య ఒప్పందం కుదిరింది. ఈ డీల్ విలువ దాదాపు రూ.35వేల
కోట్లు. ఇప్పటివరకు మూడు వ్యవస్థలు భారత్కు చేరగా.. మిగతా వాటిని 2026 ఆగస్టు నాటికి అందించే అవకాశాలున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. అయితే, అంతకంటే ముందుగానే వీటిని డెలివరీ చేసేలా డోభాల్
మాస్కోతో చర్చించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ రక్షణ వ్యవస్థలను భారత వైమానిక దళం వినియోగిస్తోంది. పాకిస్థాన్ నుంచి ఎదురయ్యే ముప్పు కోసం పంజాబ్లో, రాజస్థాన్లలో ఒక్కొక్కటి చొప్పున ఎస్-400
వ్యవస్థలను మోహరించినట్లు తెలుస్తోంది. చైనా నుంచి రక్షణ కోసం అరుణాచల్ప్రదేశ్ లేదా అస్సాంలో ఒక వ్యవస్థను రంగంలోకి దించి ఉంటారని అంచనా. ఇటీవల ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో ఈ ఎస్-400 వ్యవస్థలను
ధ్వంసం చేశామంటూ పాక్ అసత్య ప్రచారం చేయగా.. ప్రధాని మోదీ ఫొటోతో దాయాదికి గట్టి కౌంటర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. మన రక్షణ వ్యవస్థ సురక్షితంగా ఉందని ఆర్మీ కూడా స్పష్టం చేసింది.