Play all audios:
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ (IPL) 2025 సీజన్లో భాగంగా బుధవారం దిల్లీ క్యాపిటల్స్తో (Delhi Capitals) జరిగిన మ్యాచ్లో ముంబయి ఇండియన్స్ (Mumbai Indians) 59 పరుగులతో విజయం సాధించింది.
బౌలింగ్లో మిచెల్ శాంట్నర్ (3/11), జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) (3/12), బ్యాటింగ్లో సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) (73*) రాణించడంతో ముంబయి ప్లేఆఫ్స్లో చివరి బెర్త్ను
సొంతం చేసుకుంది. గతంలో అయిదు సార్లు ఐపీఎల్ టైటిల్ను గెలుచుకున్న ముంబయి ఇండియన్స్ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. అయితే ముంబయి రెండోస్థానంలోకి దూసుకెళ్లే అవకాశం కూడా
ఉంది. ఇది జరగాలంటే మాత్రం పంజాబ్ కింగ్స్తో మరికొన్ని రోజుల్లో జరగనున్న మ్యాచ్లో ముంబయి ఇండియన్స్ జట్టు కచ్చితంగా విజయం సాధించాల్సి ఉంటుంది. ముంబయి టీమ్ ఇప్పటి వరకు ఆడిన 13 మ్యాచుల్లో
ఎనిమిదింట్లో విజయం సాధించింది. 16 పాయింట్లతో పట్టికలో నాలుగోస్థానంలో ఉంది. జైపుర్ వేదికగా మే 26న పంజాబ్ కింగ్స్తో మ్యాచ్ జరగనుంది. లీగ్ దశలో ముంబయికి ఇదే చివరి పోరు. ఇందులో విజయం
సాధిస్తే ముంబయి 18 పాయింట్లకు చేరుకుంటుంది. అయితే ఈ మ్యాచ్లో గెలిచినంత మాత్రానే ముంబయికి రెండోస్థానం దక్కదు. మరికొన్ని సమీకరణాలూ కలసిరావాల్సి ఉంటుంది. ప్రస్తుతం 18 పాయింట్లతో ఉన్న గుజరాత్
టైటాన్స్ (Gujarat Titans) మొదటి స్థానంలో, 17 పాయింట్లతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bengaluru), పంజాబ్ కింగ్స్ (Punjab Kings) రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. గుజరాత్
టైటాన్స్.. లీగ్ దశలో లఖ్నవూ సూపర్ జెయింట్స్ (Lucknow Super Giants), చెన్నై సూపర్ కింగ్స్తో (Chennai Super Kings) ఒక్కో మ్యాచ్ ఆడాల్సి ఉంది. రెండో స్థానంలో ఉన్న రాయల్ ఛాలెంజర్స్
బెంగళూరు.. సన్రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad), లఖ్నవూ సూపర్ జెయింట్స్తో తలపడాల్సి ఉంది. మూడో స్థానంలో ఉన్న పంజాబ్ కింగ్స్.. దిల్లీ, ముంబయితో తన చివరి రెండు మ్యాచ్లు ఆడాల్సి
ఉంది. ముంబయి ఇండియన్స్ జట్టు టాప్-2 లోకి రావాలంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ మిగతా మ్యాచుల్లో ఓడిపోవాల్సి ఉంటుంది. అలాగే పంజాబ్ కింగ్స్తో జరగాల్సి
ఉన్న తమ చివరి మ్యాచ్లో ముంబయి ఇండియన్స్ కచ్చితంగా గెలవాలి. ఇలా జరిగితే ముంబయి తనకంటే ముందున్న రెండు జట్లను నెట్ రన్రేట్, పాయింట్ల విషయంలో అధిగమించి రెండో స్థానంలోకి చేరుకుంటుంది.
దీనికి మొత్తం మూడు అవకాశాలున్నాయి. _అవకాశం 1:_ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ జట్లు లీగ్ దశలో మిగిలిన తమ రెండు మ్యాచ్లను ఓడిపోవాల్సి ఉంటుంది. ఇదే జరిగితే.. గుజరాత్
టైటాన్స్ 22 పాయింట్లతో మొదటి స్థానంలో, 18 పాయింట్లతో ముంబయి ఇండియన్స్ రెండో స్థానంలో, 17 పాయింట్లతో ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్ మూడు, నాలుగు స్థానాల్లో నిలుస్తాయి. _అవకాశం 2:_ గుజరాత్
టైటాన్స్, ఆర్సీబీ తమకు మిగిలి ఉన్న మ్యాచుల్లో ఓడిపోతే.. 19 పాయింట్లతో పంజాబ్ కింగ్స్ మొదటి స్థానంలో, 18 పాయింట్లతో ముంబయి ఇండియన్స్ రెండో స్థానంలో, గుజరాత్ టైటాన్స్ మూడో స్థానంలో, 17
పాయింట్లతో ఆర్సీబీ నాలుగో స్థానంలో ఉంటాయి. _అవకాశం 3: _ఒకవేళ పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మిగిలిన మ్యాచుల్లో ఓడిపోతే.. 21 పాయింట్లతో ఆర్సీబీ మొదటి స్థానంలో, 18 పాయింట్లతో ముంబయి
ఇండియన్స్ రెండో స్థానంలో, గుజరాత్ టైటాన్స్ మూడో స్థానంలో, పంజాబ్ కింగ్స్ 17 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలుస్తాయి.