Play all audios:
ఇంటర్నెట్ డెస్క్: పాకిస్థాన్కు గూఢచర్యం చేస్తున్న సీఆర్పీఎఫ్ జవాన్ (CRPF Jawan) మోతీ రామ్ జాట్ను జాతీయ దర్యాప్తు సంస్థ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అతడి గురించి పలు కీలక విషయాలు
వెలుగులోకి వస్తున్నాయి. పర్యాటకులపై ఉగ్రదాడికి ముందు మోతీ రామ్ పహల్గాం (Pahalgam)లోనే విధులు నిర్వర్తించినట్లు సమాచారం. కేవలం దాడి జరగడానికి ఆరు రోజుల ముందే అతడు అక్కడి నుంచి బదిలీ అయినట్లు
విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. సీఆర్పీఎఫ్లో అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్(ఏఎస్సై)గా పనిచేస్తున్న మోతీ రామ్ జాట్.. 2023 నుంచి దేశ భద్రతకు సంబంధించిన కీలకమైన సమాచారాన్ని పాక్
(Pakistan) గూఢచర్య ఏజెంట్లకు అందజేస్తున్నట్లు అధికారులు సోమవారం తెలిపారు. ఆన్లైన్లో అతడి కదలికలు అనుమానాస్పదంగా ఉండటంతో కొంతకాలంగా అతడి సామాజిక మాధ్యమ ఖాతా మీద సీఆర్పీఎఫ్ నిఘా పెట్టింది.
దీంతో అతడు గూఢచర్యానికి పాల్పడుతున్న విషయం వెలుగులోకి వచ్చింది. * పాక్లో యూట్యూబర్.. జ్యోతి మల్హోత్రాకు సాయుధ భద్రత! ఈ నేపథ్యంలోనే అతడిని నాలుగు రోజుల పాటు కఠినంగా విచారించిన సీఆర్పీఎఫ్
సర్వీసు నుంచి తొలగించింది. అనంతరం మే 21న ఎన్ఐఏకు అప్పగించింది. సోషల్ మీడియాలో పాకిస్థానీ హ్యాండ్లర్లతో మోతీరామ్ సంప్రదింపులు జరిపేవాడని విచారణలో గుర్తించారు. వారి నుంచి అతడు రూ.లక్షల్లో
డబ్బు తీసుకున్నాడని, ఆ మొత్తాన్ని భార్య బ్యాంకు ఖాతాకు బదిలీ చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. మన సైనిక దళాల సీక్రెట్ ఆపరేషన్లు, భద్రతా మోహరింపులు ఉన్న ప్రాంతాల సమాచారాన్ని అతడు పాక్కు
చేరవేసినట్లు తేలింది. దీనిపై ఎన్ఐఏ మరింత లోతుగా దర్యాప్తు చేస్తోంది. ఏప్రిల్ 22న పహల్గాంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన బైసరన్ లోయలో పర్యాటకులపై ఉగ్రవాదులు పాశవిక దాడికి (Pahalgam Terror
Attack) పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటన తర్వాత పాక్ గూఢచర్యంపై నిఘా సంస్థలు దృష్టిసారించాయి. ఈ క్రమంలోనే పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్లో పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. ఉత్తరభారతంలోని
చాలా చోట్ల పాక్ మద్దతు ఉన్న ఈ స్పై నెట్వర్క్ క్రియాశీలకంగా పనిచేస్తున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది.