Play all audios:
భారత్ దాడుల్లో పాకిస్థాన్లో మరణించిన వారికి సంతాపం తెలియజేస్తూ చేసిన ప్రకటనను కొలంబియా ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఇంటర్నెట్డెస్క్: ఆపరేషన్ సిందూర్ (operation sindoor) సమయంలో
పాకిస్థాన్లో ప్రాణాలు కోల్పోయిన వారికి కొలంబియా ప్రభుత్వం సంతాపం తెలపడంపై కాంగ్రెస్ నాయకుడు శశిథరూర్ (Shashi Tharoor) అసహనం వ్యక్తంచేసిన సంగతి తెలిసిందే. ఈక్రమంలోనే తమ సంతాప ప్రకటనను
కొలంబియా (Colombia) వెనక్కి తీసుకుంది. ఉగ్రవాదంపై పాకిస్థాన్ (Pakistan) అనుసరిస్తున్న విధానాన్ని ఎండగట్టేందుకు భారత పార్లమెంటరీ అఖిలపక్ష ప్రతినిధి బృందాలు పలు దేశాల్లో పర్యటిస్తున్న సంగతి
తెలిసిందే. అందులోభాగంగా థరూర్ నేతృత్వంలోని బృందం కొలంబియాకు వెళ్లింది. ఈక్రమంలో ఆ దేశ విదేశాంగ శాఖ ఉప మంత్రి రోసా యెలాండ్ విల్లావిసెన్సియోతో థరూర్ భేటీ అయ్యారు. పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి, ఆ
తర్వాత భారత్ నిర్వహించిన ఆపరేషన్ సిందూర్కు సంబంధించిన పూర్తి విషయాలను ఆయన తెలియజేశారు. అనంతరం యెలాండ్ మీడియాతో మాట్లాడుతూ.. తమ ప్రకటనను వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపారు. ‘ఈ రోజు భారత
బృందం మాకు అన్ని విషయాలను తెలియజేసింది. కశ్మీర్లో ఏం జరిగిందనేది పూర్తిగా తెలుసుకున్నాం. దాడులకు దారితీసిన పరిస్థితిపై అవగాహన వచ్చింది’ అని పేర్కొన్నారు. ఈ ప్రకటన అనంతరం థరూర్ కొలంబియా
ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఉగ్రవాదంపై తమ వైఖరిని వారు పూర్తిగా తెలుసుకున్నారని థరూర్ తెలియజేశారు. * పాక్లో ఉగ్రవాదులు హతమైతే సంతాపమా..? శశిథరూర్ కొలంబియాకు పర్యటనకు వెళ్లిన థరూర్
అక్కడి మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. పాక్లోని ఉగ్రస్థావరాలపై భారత్ దాడి చేసిన తర్వాత అక్కడ మరణించిన వారికి కొలంబియా సంతాపం తెలపడంపై ఆయన అసహనం వ్యక్తంచేశారు. దాదాపు నాలుగు
దశాబ్దాలుగా భారత్ అనేక ఉగ్రదాడులను భరించిందని తెలిపారు. పాకిస్థాన్ తన సైనిక పరికరాలను వారి రక్షణ కోసం కాకుండా.. పక్క దేశాలపై దాడి కోసం వినియోగిస్తోందని వివరించారు.