Play all audios:
సిరివెన్నెలను ఉద్దేశించి గతంలో తాను ఇచ్చిన ప్రసంగంపై దర్శకుడు త్రివిక్రమ్ స్పందించారు. ‘నా ఉచ్ఛ్వాసం కవనం’ కార్యక్రమంలో మాట్లాడారు. ఇంటర్నెట్ డెస్క్: పాటల రచయిత సిరివెన్నెల
సీతారామశాస్త్రిని ఉద్దేశించి కొన్నాళ్ల క్రితం ఓ వేడుకలో దర్శకుడు త్రివిక్రమ్ (Trivikram) ఇచ్చిన స్పీచ్ వైరల్ అయిన సంగతి తెలిసిందే. ‘నా ఉచ్ఛ్వాసం కవనం’ (Naa Uchvasam Kavanam)
కార్యక్రమానికి హాజరైన ఆయన ఆ ప్రసంగంపై స్పందించారు. ఆ రోజు తాను సిరివెన్నెలను పొగడలేదని, ఆయనపై కోప్పడ్డానని అన్నారు. ‘ఈటీవీ’లో ప్రసారమవుతున్న కార్యక్రమం ఇది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు..
సిరివెన్నెలతో తమకున్న అనుబంధాన్ని పంచుకోగా తాజా ఎపిసోడ్లో త్రివిక్రమ్ పలు విశేషాలు పంచుకున్నారు. * ‘జల్సా’లో ఆ పాటకు 30 వెర్షన్లు రాశారు: త్రివిక్రమ్ ‘‘చాలామంది ఆయన్ను ప్రశంసించానని
అనుకున్నారు. కానీ, నేను పొగడలేదు. పొగడ్తలో కొంచెం డ్రామా, కొంచెం అతిశయోక్తి ఉంటాయి. నేను నిజమే మాట్లాడా. అందుకే ఆ ప్రసంగం ఎక్కువ మందికి నచ్చింది. సినిమా స్థాయిని ఆయన పెంచారు. సినిమా పాట వల్ల
అక్కడే బందీ అయిన వ్యక్తి. అందరికీ అర్థం అయ్యేలా చెప్పాల్సి రావడం కవికి శిక్ష. మేం కలిసినప్పుడు ఎన్నో అంశాల గురించి చర్చించుకునేవాళ్లం. విషయం ఏదైనా లోతుగా ఆలోచిస్తారు. ఆయన వ్యాసాలు రాసేవారని
చాలామందికి తెలియదు. ‘చిలకా ఏ తోడు లేక’లాంటి పాటలను ఆయన అలవోకగా రాసేవారు. ఆయన ఇంకా ఎంతో చేయగలిగిన వ్యక్తి. కానీ, అప్పట్లో అవకాశాలు, తెలుగు సినిమా పరిధి తక్కువ. ఆయన విషయంలో నాకు ఇలా బాధ, కోపం
ఉండేవి. దానినే ఆ రోజు చూపించా’’ అని వివరించారు. ‘‘ఎంత పెద్ద విషయాన్ని అయినా ఒక్క లైన్లో చెప్పేవారు. అందుకు నిదర్శనం ‘కృష్ణుడు లేని కురుక్షేత్రమున సాగే ఈ ఘోరం.. చితి మంటల సిందూరం’ (సిందూరం
సినిమాలోని అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని పాట). ఆయన రాసిన పాటల్లో నాకు ‘ఆకాశం తాకేలా’ (నువ్వొస్తానంటే నేనొద్దంటానా చిత్రంలోది) బాగా ఇష్టం. ఆయన ఆ పాట రాయడం పూర్తయిన వెంటనే నాకు ఫోన్ చేసి, పాడి
వినిపించారు. మనం తేలిగ్గా తీసుకునే భావాలకు ఉన్న అసలైన బరువును చూపిస్తారు. ప్రేమ అంటే ఆధ్మాత్మిక భావన కలిగేలా పాటలతో చెప్పే ప్రయత్నం చేశారు. భవిష్యత్తులో ఆయన పాటలను ఇంకా ఎక్కువగా వింటారనే
నమ్మకం నాకుంది. మేం బంధువులుగా ఎప్పుడూ ఫీలవలేదు. నేను ఆయన్ను సర్ అంటే ఆయన నన్ను శ్రీను అని పిలిచేవారు’’ అని నాటి జ్ఞాపకాలు గుర్తుచేసుకున్నారు.