Play all audios:
MI vs RCB: బెంగళూరుపై తిలక్ వర్మ హాఫ్ సెంచరీ సాధించాడు. అయినా ముంబయి విజయం సాధించలేదు. కానీ, అతడి ఆటతీరు మాత్రం ఆకట్టుకుంది. మరోమారు గత మ్యాచ్లో ‘రిటైర్డ్ ఔట్’ నిర్ణయం చర్చనీయాంశంగా
మారింది. ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2025 సీజన్లో ముంబయి ఇండియన్స్ (Mumbai Indians) ఖాతాలో నాలుగో ఓటమి. సొంత మైదానం వాంఖడే వేదికగా జరిగిన మ్యాచ్లో ముంబయి పరాజయం పాలైంది. ఉత్కంఠగా సాగిన
పోరులో ముంబయిపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. తిలక్ వర్మ (56), హార్దిక్ పాండ్య (42) పోరాడినా ముంబయికి ఓటమి తప్పలేదు. గత మ్యాచ్లోనూ (లఖ్నవూ) సరిగ్గా 12
పరుగుల తేడాతో ఓడిపోవడం గమనార్హం. అప్పుడు తిలక్ వర్మ ‘రిటైర్డ్ ఔట్’ నిర్ణయం క్రికెట్ వర్గాల్లో చర్చకు దారితీసింది. కెప్టెన్ హార్దిక్, కోచ్ మహేల జయవర్థెనె వివరణ కూడా ఇచ్చారు. ఇప్పుడు తిలక్
హాఫ్ సెంచరీ సాధించడంతో మరోమారు ముంబయి మేనేజ్మెంట్ నిర్ణయంపై విమర్శలు వచ్చాయి. దానిపై హార్దిక్ మళ్లీ స్పందించాడు. * ముంబయిని ఊరించి.. బెంగళూరుకే చిక్కింది ‘‘వాంఖడే పిచ్ బ్యాటింగ్కు
అనుకూలం. ఈ విషయంలో బౌలర్లను ఏమీ అనలేం. మా బ్యాటింగ్ ఆర్డర్లో మరిన్ని ఆప్షన్లేవీ లేవు. నమన్ ధిర్ సాధారణంగా డౌన్ ఆర్డర్లో వస్తాడు. గత మ్యాచ్లోనే అతడు కాస్త ముందుకువచ్చాడు. అప్పుడు రోహిత్
అందుబాటులో లేడు. దీంతో ఎవరో ఒకరు ముందుకు వెళ్లాలి. నమన్ ముందుకొచ్చి అద్భుతంగా ఆడాడు. రోహిత్ మళ్లీ వచ్చాడు. నమన్ను లోయర్ ఆర్డర్కు పంపించాం. తిలక్ వర్మ అద్భుతంగా ఆడాడు. గత మ్యాచ్లో చాలా
విషయాలు జరిగాయి. బయట వ్యక్తులు ఎన్నో విషయాలు అన్నారు. కానీ, వారికి తెలియంది ఏంటంటే తిలక్కు లఖ్నవూతో మ్యాచ్కు ముందు రోజు బంతి బలంగా తాకింది. అతడిని రిటైర్డ్ ఔట్గా ప్రకటించడం వెనక వ్యూహం
ఉన్నప్పటికీ.. తిలక్ వేలికి గాయమైంది. దీంతో అతడు దూకుడుగా ఆడలేకపోయాడు. కోచ్ నిర్ణయం మేరకు తిలక్ను పిలిపించి కొత్త బ్యాటర్తో ఎటాక్ చేయించాలని భావించాం. ఇప్పుడు ఆర్సీబీపై చాలా బాగా ఆడాడు’’
అని హార్దిక్ (Hardik Pandya) తెలిపాడు. పవర్ప్లేలో వెనకబడ్డాం.. ‘‘వాంఖడేలో 220+ స్కోరును ఛేదించడం పెద్ద కష్టమేం కాదు. అయితే, పవర్ప్లేలో వికెట్లు పడటం మాకు నష్టం చేసింది. కొన్ని ఓవర్లలో
పరుగులు రాకపోవడంతో ఇబ్బందిపడ్డాం. అదే మమ్మల్ని ఛేదనలో వెనకబడేలా చేసింది. డెత్లోనూ సరిగ్గా ప్రదర్శన చేయలేదనిపించింది. ఈ మ్యాచ్తో బుమ్రా మైదానంలోకి దిగడం ఆనందంగా ఉంది’’ అని పాండ్య
వెల్లడించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు 221/5 స్కోరు చేసింది. అనంతరం ముంబయి తొమ్మిది వికెట్ల నష్టానికి 209 పరుగులకే పరిమితమైంది.