Play all audios:
ఇంటర్నెట్ డెస్క్: పాకిస్థాన్లోని (Pakistan) పంజాబ్ ప్రావిన్సులో కాలుష్యం తీవ్ర ప్రభావం చూపిస్తోంది. దీంతో లక్షల మంది అనారోగ్యం బారిన పడుతున్నారు. ఇలా గడిచిన నెల రోజుల్లోనే దాదాపు 18లక్షల
మంది ఆసుపత్రుల బాట పట్టినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. కాలుష్య స్థాయిలు (Pollution) రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో మరో ఐదు రోజులపాటు పాఠశాలలు మూసివేయాలని అధికారులు ఆదేశించారు.
పంజాబ్ ప్రావిన్సు జనాభా దాదాపు 12.7కోట్లు. గత కొన్ని రోజులుగా ఇక్కడ కాలుష్య స్థాయిలు గణనీయంగా పెరిగాయి. ప్రభావిత జిల్లాల్లో అస్వస్థతకు గురవుతున్న వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. గడిచిన 30
రోజుల్లోనే 18 లక్షలకు పైగా బాధితులు ఆసుపత్రులు, ప్రైవేటు క్లినిక్లను ఆశ్రయించినట్లు స్థానిక ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. వీరిలో ఎక్కువ మంది శ్వాసకోశ సంబంధిత వ్యాధులు, కళ్లమంట వంటి
లక్షణాలతో బాధపడుతున్నారని తెలిపారు. లాహోర్తోపాటు పంజాబ్లోని 17 జిల్లాల్లో దీని ప్రభావం అధికంగా ఉంది. దీంతో అక్కడి పాఠశాలలతోపాటు పార్కులు, మ్యూజియాలను మూసివేశారు. అత్యవసరమైతేనే ప్రజలు బయటకు
రావాలని, లేదంటే ఇంటికే పరిమితం కావాలని సూచిస్తున్నారు. ఈ తరహా సమస్యలతో బాధపడుతున్న వారి సంఖ్య వాస్తవంగా మరింత ఎక్కువగా ఉన్నట్లు స్థానిక అధికారులే చెబుతున్నారు. ఈ ప్రావిన్సులో కాలుష్యం
కారణంగా దాదాపు 1.1కోట్ల మంది చిన్నారుల ఆరోగ్యం ప్రమాదంలో ఉందని ఐక్యరాజ్య సమితి చిన్నారుల విభాగం కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.