Play all audios:
యూఎస్ ఎయిడ్ సంస్థలో ప్రపంచవ్యాప్తంగా కేవలం కొద్దిమందిని మినహాయించి మిగిలిన వారికి అమెరికా ప్రభుత్వం బలవంతపు సెలవులు ఇచ్చింది. ఇంటర్నెట్ డెస్క్: అంతర్జాతీయ అభివృద్ధి కార్యక్రమాలకు, మానవతా
దృష్టితో సహాయానికీ యూఎస్ ఎయిడ్ (USAID) సంస్థ ద్వారా అందుతున్న నిధులను అమెరికా ప్రభుత్వం ఆపివేసిన విషయం తెలిసిందే. తాజాగా 2 వేల మంది యూఎస్ ఎయిడ్ ఉద్యోగులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్
ట్రంప్ (Donald Trump) వేటు వేశారు. మిగిలినవారిలో కొంతమందిని మినహాయించి వేలమంది ఉద్యోగులకు బలవంతపు సెలవులు ఇచ్చినట్లు యూఎస్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ వెబ్సైట్లోని నోటీసు ద్వారా
తెలుస్తోంది. ఉద్యోగుల తొలగింపునకు ఫెడరల్ జడ్జి అనుమతించిన తర్వాతే ట్రంప్ యంత్రాంగం ఈ విషయంలో ముందుకెళ్లారు. * చరిత్రలో ఎన్నడూ ఇలాంటిది జరగలేదు ప్రభుత్వ ప్రణాళికను నిలిపివేసేలా ఆదేశాలు
జారీ చేయాలని కోరిన ఉద్యోగుల విజ్ఞప్తిని యూఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి కార్ల్ నికోలస్ తిరస్కరించారు. ప్రభుత్వం చేసే అనవసరపు ఖర్చులను తగ్గించడానికి పనిచేస్తున్న మస్క్ (Elon Musk) నేతృత్వంలోని
డోజ్ (DOGE) ఇప్పటికే అనేకమంది యూఎస్ఎయిడ్ ఉద్యోగులపై వేటు వేసిన విషయం తెలిసిందే. తాజాగా తీసుకొన్న ఈ నిర్ణయం మిగిలిన ఉద్యోగుల్లో భయాందోళన కలిగిస్తోంది. అయితే యుఎస్ఎయిడ్ ద్వారా వృథా ఖర్చులు
ఎక్కువవుతున్నాయని, అది నేరగాళ్ల సంస్థ అని మస్క్ ఇప్పటికే ఆరోపించిన విషయం తెలిసిందే. అందుకే నిధులను ఆపేస్తున్నట్లు ట్రంప్ ప్రభుత్వం ప్రకటించింది. ఇందులోభాగంగా దాదాపు 600 మంది ఉద్యోగులను
కార్యాలయ భవనంలోకి వెళ్లనీయకుండా నిలిపివేశారు. ఈ ఆదేశాలపై ఫెడరల్ జడ్జి అమీర్ అలీ గతవారం తాత్కాలికంగా స్టే ఇచ్చారు. అమెరికా కాంగ్రెస్ సభ్యులు యూఎస్ఎయిడ్ ద్వారా సాయం అందించడానికి ఆమోదం
తెలిపినప్పుడు ప్రభుత్వం దాన్ని ఎలా నిలిపేయగలదని జడ్జి నిలదీశారు. అయినా ట్రంప్ తన చర్యలను సమర్థించుకుంటున్నారు. యూఎస్ ఎయిడ్ ద్వారా భారత్లో జరిగిన ఎన్నికలలో పోలింగ్ శాతం పెంచడానికి
అమెరికా ప్రభుత్వం రూ.182 కోట్లు ఇచ్చిందని ట్రంప్ పలుమార్లు ఆరోపించారు. ఇకపై అటువంటి నిధులను రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రపంచంలో అధిక సుంకాలు విధించే దేశాల్లో ఒకటైన భారత్ వద్ద చాలా
డబ్బు ఉందని, ఆ దేశానికి తామెందుకు నిధులు ఇవ్వాలని ప్రశ్నించారు. దీంతో ఈ విషయంపై ఇరుదేశాల మధ్య భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.