Play all audios:
ఈ ఏడాది జరగనున్న ఆసియా కప్ (Asia Cup 2025) టోర్నీ నుంచి టీమ్ఇండియా వైదొలగాలని నిర్ణయించినట్లు వార్తలు రాగా.. వీటిని బీసీసీఐ ఖండించింది. ఇంటర్నెట్ డెస్క్: ఇటీవల భారత్, పాకిస్థాన్ మధ్య
(INDIA vs PAKISTAN) నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ ఏడాది జరగనున్న ఆసియా కప్ (Asia Cup 2025) టోర్నీ నుంచి టీమ్ఇండియా వైదొలగాలని నిర్ణయించినట్లు వార్తలొచ్చాయి. అయితే, వీటిని బీసీసీఐ
ఖండించింది. ఈ ఏడాది సెప్టెంబరులో జరిగే పురుషుల ఆసియా కప్లో డిఫెండింగ్ ఛాంపియన్ అయిన టీమ్ఇండియా ఆడే అవకాశాలు లేవని ఆంగ్ల మీడియాలో కథనాలు వచ్చాయి. అంతేకాకుండా జూన్ నెలలో జరిగే మహిళల
ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ నుంచి కూడా వైదొలగాలని బీసీసీఐ నిర్ణయించినట్లు వార్తలొచ్చాయి. ప్రస్తుతం ఆసియా క్రికెట్ మండలికి పాకిస్థాన్ మంత్రి, పీసీబీ ఛైర్మన్ మోసిన్ నఖ్వీ అధ్యక్షుడిగా
ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరిగింది. అయితే, ఈ వార్తల్లో నిజం లేదని బీసీసీఐ తాజాగా స్పష్టం చేసింది. ‘ఈ రోజు ఉదయం నుంచి ఆసియా కప్, మహిళల ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ టోర్నీల్లో
పాల్గొనకూడదని బీసీసీఐ నిర్ణయం తీసుకున్నట్టు జరుగుతున్న ప్రచారం మా దృష్టికి వచ్చింది. అటువంటి వార్తల్లో ఎలాంటి నిజం లేదు. ఇప్పటి వరకు బీసీసీఐ ఏసీసీ ఈవెంట్ల గురించి చర్చించలేదు. ప్రస్తుతం మా
దృష్టి అంతా ఐపీఎల్ను సజావుగా నిర్వహించడం, టీమ్ఇండియా పురుషుల, మహిళల జట్ల ఇంగ్లాండ్ పర్యటనపైనే ఉంది. ఆసియా కప్ విషయం లేదా మరేదైనా ఏసీసీ ఈవెంట్ గురించి ఏ స్థాయిలోనూ చర్చ జరగలేదు. దీని
గురించి ఏవైనా వార్తలు వస్తే అవన్నీ పూర్తిగా ఊహాజనితం. ఏసీసీ ఈవెంట్ గురించి ఏదైనా చర్చగాని, ముఖ్యమైన నిర్ణయంగాని తీసుకుంటే మీడియాకు వెల్లడిస్తాం’ అని బోర్డు కార్యదర్శి దేవజిత్ సైకియా
తెలిపారు.