Play all audios:
Stock market | ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు, గరిష్ఠాల వద్ద లాభాల స్వీకరణతో సూచీలు నష్టాలు చవిచూశాయి. ముఖ్యంగా ఐటీ షేర్లు
ప్రధానంగా నష్టాలు మూటగట్టుకున్నాయి. అమెరికా ప్రభుత్వ క్రెడిట్ రేటింగ్ను మూడీస్ సంస్థ AAA నుంచి AA1 తగ్గించింది. దీంతో ఐటీ షేర్లు ఒత్తిడికి గురయ్యాయి. ఐటీ కంపెనీలకు అమెరికా నుంచే ప్రధానంగా
ఆదాయం వస్తుండడమే ఇందుక్కారణం. ఈ క్రమంలో నిఫ్టీ 25 వేల దిగువకు చేరింది. సెన్సెక్స్ ఉదయం 82,354.92 పాయింట్ల వద్ద (క్రితం ముగింపు 82,330.59) స్వల్ప లాభాల్లో ప్రారంభమైంది. రోజంతా ఓ మోస్తరు
శ్రేణిలో కదలాడింది. ఇంట్రాడేలో 81,964.57 - 82,424.10 పాయింట్ల మధ్య కదలాడిన సూచీ.. చివరికి 271.17 పాయింట్ల నష్టంతో 82,059 వద్ద ముగిసింది. నిఫ్టీ 74.35 పాయింట్ల నష్టంతో 24,945.45 వద్ద
స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 85.40గా ఉంది. సెన్సెక్స్ 30 సూచీలో ఎటర్నల్, ఇన్ఫోసిస్, టీసీఎస్, టెక్ మహీంద్రా, రిలయన్స్ షేర్లు ప్రధానంగా నష్టపోయాయి. పవర్గ్రిడ్ కార్పొరేషన్,
బజాజ్ ఫైనాన్స్, ఎన్టీపీసీ, ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సూచీలు లాభపడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 64.72 డాలర్ల వద్ద కొనసాగుతుండగా.. బంగారం ఔన్సు 3239
డాలర్ల వద్ద ట్రేడవుతోంది.