Play all audios:
Sikkim | ఇంటర్నెట్డెస్క్: ఈశాన్య రాష్ట్రాల్లో వర్ష బీభత్సం ఏమాత్రం తగ్గలేదు. తాజాగా సిక్కింలోని ఛటేన్ అనే ప్రదేశంలో మిలిటరీ క్యాంప్పై కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ముగ్గురు భద్రతా
సిబ్బంది మరణించగా.. మరో ఆరుగురి ఆచూకీ గల్లంతైంది. ఈ విషయాన్ని రక్షణశాఖ అధికారులు సోమవారం ధ్రువీకరించారు. ఆదివారం రాత్రి 7 గంటల సమయంలో భారీ వర్షం కారణంగా ఈ ప్రమాదం చోటుచేసుకొంది. ముగ్గురి
మృతదేహాలను దళాలు గుర్తించాయి. మరో నలుగురు ఈ ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఇక ఆచూకీ గల్లంతైన వారిని కాపాడేందుకు సహాయక బృందాలు నిర్విరామంగా శ్రమిస్తున్నాయని అధికారులు తెలిపారు. ఈశాన్య భారత్లో
రెడ్అలర్ట్.. ఈశాన్య భారత్లోని రాష్ట్రాల్లో నేడు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ రెడ్అలర్ట్ జారీ చేసింది. ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని
పేర్కొంది. దీంతోపాటు ఉరుములు, పిడుగులు పడొచ్చని హెచ్చరించింది. అస్సాం, మణిపుర్, అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర, మిజోరాం, నాగాల్యాండ్, మేఘాలయలో అతి భారీ వర్షాలు పడొచ్చని వెల్లడించింది.
పశ్చిమబెంగాల్, సిక్కిం, ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు పడతాయని తెలిపింది. ఇక జమ్మూకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హరియాణ, ఉత్తర్ప్రదేశ్లలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం
ఉందని చెప్పింది. * ఈశాన్య రాష్ట్రాల్లో కుంభవృష్టి ముఖ్యంగా నైరుతి రుతుపవనాలు తొందరగా రావడం, బంగ్లాదేశ్, మేఘాలయాపై అల్పపీడనం ఏర్పడటం వంటి కారణాలతో ఈశాన్య రాష్ట్రాల్లో అతిభారీ వర్షాలు
పడుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. అస్సాంలో ఆదివారం 7 ప్రధాన నదులు ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. 20కి పైగా జిల్లాల్లో వరద జలాలతో సుమారు 4 లక్షల మంది ప్రజలు ఇబ్బందిపడుతున్నారు.
గువాహటిలో శనివారం 24 గంటల్లోనే 11 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. గత 67 ఏళ్లలో మే నెలలో ఒక్క రోజులో నమోదైన అత్యధిక వర్షపాతం ఇదే కావడం గమనార్హం. ఇక త్రిపుర రాజధాని అగర్తలలో ఎడతెగని
వర్షంతో ఓ వ్యక్తి మ్యాన్హోల్లో పడి చనిపోయాడు. మూడు గంటల వ్యవధిలోనే 20 సెం.మీ.ల రికార్డు వర్షపాతం నమోదైనట్లు అధికారులు ఆదివారం తెలిపారు.