Play all audios:
Encounter: జమ్మూకశ్మీర్లో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. శ్రీనగర్: జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదుల కోసం ముమ్మర వేట కొనసాగుతోంది. పుల్వామా జిల్లాలోని థ్రాల్ ప్రాంతంలో
ఉగ్రవాదులు నక్కినట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం రావడంతో భద్రతా బలగాలు తనిఖీలు చేపట్టాయి. ఈ క్రమంలోనే నాదిర్ గ్రామంలో గాలింపు చేస్తుండగా.. ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో భద్రతా సిబ్బంది
ఎదురుకాల్పులు (Encounter) చేపట్టారు. ఈ ఎన్కౌంటర్లో జైషే మహ్మద్ ముఠాకు చెందిన ముగ్గురు ఉగ్రవాదులు హతమైనట్లు అధికారులు వెల్లడించారు. హతులను ఆసిఫ్ అహ్మద్ షేక్, ఆమిర్ నజీర్ వని, యావర్
అహ్మద్ భట్గా గుర్తించారు. పహల్గాం ఉగ్రదాడిలో వీరి హస్తం ఉందా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. కాగా.. జమ్మూకశ్మీర్ (Jammu and Kashmir)లో ఎన్కౌంటర్ జరగడం 48
గంటల్లో ఇది రెండోసారి. మంగళవారం షోపియాన్ ప్రాంతంలోని జిన్పాథర్ కెల్లర్లో చోటుచేసుకున్న ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. వీరిని లష్కరే తయ్యిబాకు చెందిన
ముఠా సభ్యులుగా గుర్తించారు. కశ్మీర్ లోయలో పలు దాడులకు పాల్పడినట్లు భద్రతా బలగాలు వెల్లడించాయి. ఏప్రిల్ 22న పహల్గాంలోని బైసరన్ లోయలో పర్యాటకులపై ఉగ్రవాదులు మారణహోమానికి పాల్పడిన సంగతి
తెలిసిందే. ఈ ఘటనలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. సైనిక దుస్తుల్లో వచ్చిన ఉగ్రవాదులు అతి సమీపం నుంచి కాల్పులు జరిపిన అనంతరం అటవీ ప్రాంతంలోకి పారిపోయారు. వీరికోసం భద్రతా సిబ్బంది తీవ్రంగా
గాలిస్తున్నారు. ఉగ్రదాడికి కారకులుగా భావిస్తోన్న ముగ్గురు పాకిస్థానీ ఉగ్రవాదుల ఫొటోలతో కూడిన పోస్టర్లను కూడా ఏర్పాటు చేశారు.