Play all audios:
పూరీజగన్నాథ్ ఆలయాన్ని సందర్శించిన సమయంలో ఆమె ఓ డ్రోన్ను ఎగరవేసినట్లు గుర్తించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇంటర్నెట్ డెస్క్: పాకిస్థాన్ నిఘా సంస్థలకు భారత్ (India)కు చెందిన సున్నితమైన
సమాచారాన్ని చేరవేస్తున్నారన్న ఆరోపణలపై యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. విచారణలో భాగంగా ఆమె గురించి మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. యూట్యూబ్
వీడియోల పేరుతో వివిధ ప్రాంతాలకు తిరుగుతూ భారత్కు చెందిన సున్నితమైన సమాచారాన్ని పాక్కు చేరవేస్తున్న జ్యోతి గతేడాది పూరీతో పాటు ఉజ్జయిని ప్రాంతానికి కూడా వెళ్లినట్లు అధికారులు పేర్కొన్నారు.
గతేడాది ఏప్రిల్లో జ్యోతి ఉజ్జయినిలోని మహాకాళేశ్వర్ ఆలయాన్ని సందర్శించినట్లు మధ్యప్రదేశ్ పోలీసులు పేర్కొన్నారు. అయితే విచారణలో ఎటువంటి నేరారోపణలు బయటపడలేదని..అక్కడ ఆమె ఏ ప్రాంతాలకు
వెళ్లింది, ఎక్కడ బస చేసింది అనే విషయాలపై దర్యాప్తు చేస్తున్నామని అధికారులు తెలిపారు. మరోవైపు 2024లో పూరీకి చెందిన మరో యూట్యూబర్తో శ్రీక్షేత్రాన్ని సందర్శించిన జ్యోతి ఆలయంపై డ్రోన్ను
ఎగరవేసినట్లు అధికారులు గుర్తించారు. శ్రీక్షేత్రంపై ఉగ్రవాదుల కళ్లున్నాయని ఇటీవల కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించిన నేపథ్యంలో ఈ విషయం వెలుగులోకి రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
ఆలయంపైకి ఆమె డ్రోన్ను ఎందుకు పంపింది. అందులో ఏమి చిత్రీకరించింది అనే సమాచారాన్ని తెలుసుకోవడానికి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ట్రావెల్ బ్లాగర్, యూట్యూబర్ అయిన జ్యోతి మల్హోత్రా
ట్రావెల్ విత్ జో (Travel With Jo) పేరుతో ఓ యూట్యూబ్ ఛానెల్ నిర్వహిస్తోంది. 2023లో పాక్కు వెళ్లిన సమయంలో ఆమెకు పాక్ హైకమిషన్ ఉద్యోగి అయిన డానిష్తో పరిచయమైంది. అనంతరం ఆమె ఆ దేశ గూఢచర్య
సంస్థ ప్రతినిధులతో టచ్లోకి వెళ్లినట్లు తెలిసింది. పహల్గాం ఘటనకు ముందు ఆమె ఆ ప్రదేశాన్ని సందర్శించినట్లు పోలీసులు తెలిపారు. ఆపరేషన్ సిందూర్ సమయంలోనూ జ్యోతి.. డానిష్తో మాట్లాడినట్లు
సమాచారం. దీంతో పోలీసులు ఆమెను అరెస్టు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎన్ఐఏ, ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు కూడా ఆమెను ప్రశ్నిస్తున్నారు.