Play all audios:
దిల్లీ: ఛత్తీస్గఢ్ (Chhattisgarh)లోని నారాయణపూర్ జిల్లాలో బుధవారం ఉదయం జరిగిన ఎదురుకాల్పుల్లో 27 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఈ ఎన్కౌంటర్పై ప్రధాని నరేంద్రమోదీ (PM Modi) తాజాగా ఎక్స్
వేదికగా స్పందించారు. ఆపరేషన్లో పాల్గొన్న భద్రతా బలగాలను ప్రశంసించారు. ‘‘మీ అద్భుత విజయాన్ని చూసి గర్విస్తున్నా. మావోయిజం ముప్పును నిర్మూలించి.. ప్రజలకు శాంతి, పురోగతితో కూడిన జీవితాన్ని
అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది’’ అని ప్రధాని పేర్కొన్నారు. * మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు మృతి ఎదురుకాల్పుల్లో మావోయిస్టు అగ్ర నేత నంబాల కేశవరావు (70) అలియాస్ బసవరాజు మృతి
చెందినట్లు ఎక్స్ వేదికగా అమిత్ షా వెల్లడించిన సంగతి తెలిసిందే. ‘‘నక్సలిజం నిర్మూలనలో ఇదొక మైలు రాయి విజయం. 2026 మార్చి 31 నాటికి నక్సలిజాన్ని నిర్మూలించేందుకు మోదీ సర్కార్ దృఢ సంకల్పంతో
ఉంది’’ అని రాసుకొచ్చారు. మాధ్ ప్రాంతంలో పెద్దఎత్తున మావోయిస్టులు ఉన్నట్లు సమాచారం రావడంతో భద్రతా బలగాలు ఆపరేషన్ చేపట్టాయి. ఈ ఆపరేషన్లో బీజాపూర్, నారాయణపూర్, దంతెవాడ డీఆర్జీ బలగాలు
పాల్గొన్నాయి. ఇటీవల ఛత్తీస్గఢ్-తెలంగాణ సరిహద్దుల్లోని కరేగుట్ట పర్వతాల్లో 24 రోజులపాటు జరిగిన ఆపరేషన్లో 31 మంది మావోయిస్టులు మరణించిన సంగతి తెలిసిందే. వీరిలో 16 మంది మహిళలు ఉన్నారు.