Play all audios:
దిల్లీ: దేశంలో 16 బోగీలతో తొలి నమో భారత్ ర్యాపిడ్ రైలు (Namo Bharat Rapid Rail) పట్టాలెక్కేందుకు సిద్ధమైంది. ఏప్రిల్ 24న ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) ప్రారంభించనున్నారు. బిహార్లోని
జయ్నగర్ -పట్నా స్టేషన్ల మధ్య ఈ రైలు సేవలందించనుందని కేంద్ర రైల్వే మంత్రిత్వశాఖ వెల్లడించింది. దేశంలోనే తొలి నమో భారత్ రైలు గతేడాది సెప్టెంబర్లో అహ్మదాబాద్ -భుజ్ స్టేషన్ల మధ్య
ప్రారంభమైనప్పటికీ.. అందులో కేవలం 12 కోచ్లు మాత్రమే ఉన్నాయి. ఎక్కువ మంది ప్రయాణికులకు సేవలందించేలా కోచ్ల సంఖ్యను పెంచాలని నిర్ణయించిన రైల్వే అధికారులు.. తాజాగా 16 కోచ్లతో కొత్త రైలును
సిద్ధం చేశారు. * బిహార్లో ‘ఐఐటీ విలేజ్’.. జేఈఈ మెయిన్లో 40 మందికి పైగా ఉత్తీర్ణత అధునాతన సౌకర్యాలతో తీర్చిదిద్దిన నమో భారత్ను ప్రధాని నరేంద్ర మోదీ గురువారం పచ్చజెండా ఊపి
ప్రారంభించనున్నట్లు రైల్వే బోర్డు అధికారి దిలీప్ కుమార్ వెల్లడించారు. 16 కోచ్లతో నడిచే తొలి నమో భారత్ రైలు ఇదేనన్నారు. ఈ రైలు గరిష్ఠంగా 110కి.మీ.ల వేగంతో పరుగులు పెడుతుందని, తద్వారా
ప్రయాణ సమయం దాదాపు సగానికి తగ్గుతుందన్నారు. దీంతో ఉద్యోగ, వ్యాపార, విద్య అవసరాల కోసం పట్నా వైపు వెళ్లే ఉత్తర బిహార్లోని సామాన్య ప్రజలకు ఈ రైలు వేగవంతమైన, సురక్షిత, సౌకర్యమంతమైన ప్రయాణాన్ని
అందిస్తుందని తెలిపారు. ఇందులో అన్నీ ఏసీ కోచ్లేనని.. దాదాపు 2 వేల సీటింగ్ సామర్థ్యంతో ఈ రైలు నడుస్తుందని తెలిపారు. మరో వెయ్యి మంది నిలబడి ప్రయాణించవచ్చని తెలిపారు. రైలు నడుస్తున్న సమయంలో
నిలబడినవారు బ్యాలెన్స్ కోల్పోకుండా ఉండేందుకు హ్యాండ్ రెయిల్స్, పట్టీలు లేదా స్తంభాలను సైతం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. మధుబని, సక్రీ, దర్భంగా, సమస్థిపుర్, బరౌని, మొకమ స్టేషన్ల మీదుగా
నడిచే ఈ ర్యాపిడ్ రైలులో ప్రయాణికులు సౌకర్యంగా కూర్చొనేలా సీట్లను ఏర్పాటు చేశారు. అలాగే, టైప్-సి, టైప్-ఎ ఛార్జింగ్ పాయింట్లతో పాటు పూర్తిస్థాయిలో ఏసీ క్యాబిన్లు, మాడ్యులర్
ఇంటీరియర్స్, టాయిలెట్స్ వంటి సౌకర్యాలు ఉన్నాయి. కవచ్ భద్రతా వ్యవస్థ, సీసీటీవీలు, అగ్నిప్రమాదాన్ని గుర్తించే వ్యవస్థ, రెండు వైపులా ఇంజిన్లు (పుష్-పుల్), రైలు చేరుకొనే ప్రతి స్టేషన్
సమాచారాన్ని ప్రదర్శించే రూట్మ్యాప్లు సైతం అందుబాటులో ఉన్నాయి.