Play all audios:
ఇంటర్నెట్డెస్క్: కుటుంబానికి అండగా నిలవాలని రిసెప్షనిస్ట్గా చేరిన ఓ టీనేజ్ అమ్మాయి.. నెలరోజులకే విగతజీవిగా మారింది. అక్కడి నుంచి పోలీసుల అలసత్వం, రాజకీయ పలుకుబడి.. వీటిపై పెల్లుబికిన
ప్రజాగ్రహం.. వెరసి తాజా కోర్టు తీర్పు.. ఇలా దాదాపు మూడేళ్లకు ఆ యువతి కుటుంబానికి న్యాయం దక్కింది. ఈ కేసులో పులకిత్ ఆర్య, సౌరభ్ భాస్కర్, అంకిత్ గుప్తాలను న్యాయస్థానం దోషులుగా తేల్చింది.
ఎన్నో మలుపులు తిరిగిన ఉత్తరాఖండ్కు చెందిన అంకితా భండారీ కేసు అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. (Ankita Bhandari Murder). వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరాఖండ్
(Uttarakhand)లోని పౌడీ గఢ్వాల్ జిల్లాలో డోబ్-శ్రీకోట్ గ్రామానికి చెందిన అంకితా భండారీ(19).. 2022 ఆగస్టులో రిషికేశ్ సమీపంలోని ఒక రిసార్ట్లో రిసెప్షనిస్ట్గా చేరింది. ఆ రిసార్ట్ను అప్పటి
భాజపా సీనియర్ నేత వినోద్ ఆర్య కుమారుడు పులకిత్ ఆర్య నిర్వహిస్తున్నాడు. అక్కడ చేరిన నెల రోజులకే ఆమె కనిపించకుండా పోయింది. వీఐపీ గెస్ట్ల కోసం వ్యభిచారం చేయడానికి నిరాకరించడం ఆమె ప్రాణాల
మీదకు తెచ్చింది. ఈ ప్రత్యేక సేవల విషయంలో పులకిత్తో పాటు ఇద్దరు సిబ్బంది సౌరభ్ భాస్కర్, అంకిత్ గుప్తా ఆమెపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. అది చివరకు ఘర్షణకు దారితీసింది. తర్వాత ఆమెను ఒక వాహనంలోకి
బలవంతంగా ఎక్కించి, రిషికేష్ సమీపంలోని చిల్లా కెనాల్లో పడేశారు. తర్వాత ఏమీ తెలియనట్లు రిసార్ట్కు వచ్చేశారు. ఆమె స్నేహితుడు పుష్ప్ వల్లే ఈ ఘోరమంతా బయటపడింది. మరణానికి కొన్ని గంటల ముందు
అంకిత అతడితో మాట్లాడింది. వారు చేసిన ఒత్తిడి గురించి చెప్పింది. అదే రోజు రాత్రి ఆమెకు ఫోన్ చేయగా.. స్విచ్ఛాఫ్ అని వచ్చింది. తర్వాత ఆర్య, ఇతర సిబ్బందికి ఆమె గురించి వాకబు చేయగా.. ఒక్కొక్కరు
ఒక్కోలా సమాధానం చెప్పారు. తెల్లవారి నుంచి ఆర్య ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ అయింది. దాంతో ఆ స్నేహితుడిలో అనుమానం మొదలైంది. ఆ వెంటనే పుష్ప్, ఆమె కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు.
విచిత్రమేంటంటే.. అంకితను చంపిన వాడే మిస్సింగ్ ఫిర్యాదు ఇచ్చాడు. * హనీమూన్కు వెళ్లిన జంట అదృశ్యం! ఇక ఆమె ఆచూకీ గుర్తించాల్సిన పోలీసులు అలసత్వం ప్రదర్శించారు. ఆ రిసార్ట్ ఉన్న ప్రాంతం రెవెన్యూ
పోలీస్ ఆఫీసర్ పరిధిలో ఉంటుంది. వారికి సాధారణ పోలీసుల్లా కాకుండా అధికారాలు, దర్యాప్తు సామర్థ్యాలు చాలా పరిమితంగా ఉంటాయి. దాంతో ఆమెను గుర్తించడం ఆలస్యమైంది. మృతురాలి కుటుంబం, స్నేహితుల నుంచి
ఒత్తిడి రావడంతో మూడు రోజుల తర్వాత కేసును సాధారణ పోలీసులు అప్పగించారు. ఆ ఉదాసీనతను అప్పుడు డీజీపీగా ఉన్న అశోక్ కుమార్ కూడా అంగీకరించారు. ఇక ఆరు రోజులకు కెనాల్లో ఆమె మృతదేహాన్ని గుర్తించారు.
కాలువలో కొట్టుకుపోవడం వల్లే అంకిత మృతి చెందిందని, లైంగిక దాడి జరగలేదు కానీ.. శారీరకంగా టార్చర్ చేశారని పోస్ట్మార్టం నివేదికలో వెల్లడైంది. దాంతో స్థానికుల్లో ఆగ్రహ జ్వాలలు వ్యక్తమయ్యాయి.
నిందితులను తీసుకెళ్లిన పోలీసు వ్యాన్పై దాడికి పాల్పడ్డారు. వారిని బయటకు లాగేందుకు యత్నించారు. రిసార్ట్పైనా దాడి చేశారు. నిందితులను కాపాడుతున్నారంటూ ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు
వచ్చాయి. అయితే ఆ రిసార్ట్ను అక్రమంగా నిర్మించారంటూ రాత్రికిరాత్రే దానిపైకి ప్రభుత్వం బుల్డోజర్ను పంపి కూల్చివేయించింది. వినోద్ ఆర్యను భాజపా బహిష్కరించింది. నిందితులు ఈ కేసును పుష్ప్మీదకు
మళ్లించే ప్రయత్నాలు చేశారు. అంకిత అంత్యక్రియల సమయంలో అడ్డంకులు సృష్టించారు. ఫాస్ట్ట్రాక్ కోర్టులో కేసు సత్వర విచారణకు సీఎం పుష్కర్ సింగ్ ధామి హామీ ఇవ్వడంతో ఆందోళనలు చల్లారాయి. ఈ కేసులో మే
19న కోర్టులో తుది వాదనలు ముగియగా.. 30న తీర్పు వెలువడింది. పులకిత్, సౌరభ్, అంకిత్లను న్యాయస్థానం దోషులుగా తేల్చింది. అయితే, వినోద్ ఆర్య మాత్రం తన కుమారుడు ఏ తప్పూ చేయలేదని బహిరంగంగానే
పలుమార్లు ప్రకటించారు. తన కుమారుడు అలాంటి నేర స్వభావం కలిగిన వ్యక్తి కాదని సమర్థించుకొచ్చారు. పులకిత్, అంకిత.. ఇద్దరికీ న్యాయం జరగాలంటూ చేసిన ఆయన చేస్తున్న వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు
వ్యక్తమవుతున్నాయి.