Play all audios:
ఇంటర్నెట్ డెస్క్: #ఫండ్కావేరిఇంజిన్.. సోమవారం ఉదయం నుంచి ‘ఎక్స్’లో విపరీతంగా ట్రెండ్ అయిన పదం ఇది. ఈ ఇంజిన్కు కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతూ అనేక మంది రక్షణ రంగ నిపుణులు,
ఔత్సాహికులు, సామాన్య పౌరులు సోషల్ మీడియాలో పోస్ట్లు (#FundKaveriEngine) చేస్తున్నారు. వాయుసేన సాంకేతికతలో ఆత్మనిర్భరత సాధించేలా.. ఈ ప్రాజెక్ట్కు నిధులు, వనరులు సమకూర్చాలని మోదీ సర్కారును
కోరుతున్నారు. జాతి ప్రయోజనాలకు చాలా కీలకమైన ఈ ప్రాజెక్ట్తో విదేశీ ఫైటర్ జెట్ ఇంజిన్లపై భారత్ ఆధారపడటం తగ్గుతుందనేది నిపుణుల అభిప్రాయం. ఇంతకీ ఏంటీ ‘కావేరి ఇంజిన్’..? గగనతల పోరాటంలో
ఫైటర్ యుద్ధవిమానాలే రారాజులు. వాటికి ఎంతో కీలకమైనది అందులోని జెట్ ఇంజిన్. వీటి తయారీ పరిజ్ఞానం అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్, రష్యాల వద్ద మాత్రమే ఉంది. దాన్ని ఇతర దేశాలకు బదలాయించడానికి
అవి అంగీకరించడం లేదు. రక్షణ పరిజ్ఞానానికి సంబంధించి ఇప్పటివరకూ అనేక అంశాల్లో భారత్ స్వావలంబన సాధించినప్పటికీ.. జెట్ ఇంజిన్ విషయంలో మాత్రం ఆశించినంత పురోగతి లేదు. భారత్ 1980ల్లోనే
‘కావేరి’ ఇంజిన్ (Kaveri Engine) ప్రాజెక్టును చేపట్టింది. 80 కిలో న్యూటన్ల శక్తిని ఉత్పత్తి చేసేలా వీటిని డిజైన్ చేసి తేజస్ యుద్ధవిమానాల్లో వినియోగించాలని భావించింది. అయితే, ఇందుకోసం
రూ.వేల కోట్లు వెచ్చించినా ఆ ఇంజిన్ ఆశించిన స్థాయిలో శక్తిని అందుకోలేదు. థ్రస్ట్లో లోపాలు, బరువు సమస్యలు తలెత్తాయి. దీంతో తేజస్ ప్రోగ్రామ్ నుంచి కావేరిని తప్పించారు. దీనికి తోడు అణ్వస్త్ర
పరీక్షల వల్ల అంతర్జాతీయ ఆంక్షలకు గురవడంతో ఈ ప్రాజెక్టు దెబ్బతింది. ఇక కావేరి ఇంజిన్ను మూలన పడేసినట్లేనన్న అభిప్రాయాలూ వ్యక్తమయ్యాయి. డెరివేటివ్ వెర్షన్తో.. ఈ క్రమంలోనే రక్షణ పరిశోధన,
అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ) ఆధ్వర్యంలోని గ్యాస్ టర్బైన్ పరిశోధన సంస్థ (జీటీఆర్ఈ) కావేరి ఇంజిన్లో తగిన మార్పులు చేసి డెరివేటివ్ వెర్షన్ను రూపొందించింది. అయితే, దేశీయంగా ఫైటర్ ఇంజిన్లను
పరీక్షించేందుకు సరైన వసతుల్లేకపోవడంతో.. ఇందుకోసం దీన్ని ప్రతిసారి రష్యాకు పంపించాల్సి వచ్చేది. ఇంజిన్ల తయారీలో ప్రైవేటు సంస్థ గోద్రెజ్ ఏరోస్పేస్ను భాగస్వామిగా చేర్చుకొంటూ డీఆర్డీఓ 2022
సెప్టెంబరులో ఒప్పందం కుదుర్చుకుంది. దీని కింద ఎనిమిది ఇంజిన్లను తయారు చేస్తోంది. వీటిని తేజస్ ఫైటర్ విమానాల్లో కాకుండా మానవ రహిత పోరాట గగనతల వాహనమైన(యుకావ్) ‘ఘాతక్’లో అమర్చాలని భారత్
నిశ్చయించింది. ఆలస్యం ఎందుకు..? కావేరి ఇంజిన్లను యుద్ధవిమానాలకు వాడేలా రూపొందించేందుకు భారత్ ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉంది. ఇందుకోసం ఫ్రాన్స్ కంపెనీ శాఫ్రాన్తో ఒప్పందం కుదిరింది.
దీనికింద క్రమంగా దేశీయంగా శక్తిమంతమైన కావేరి ఇంజిన్ తయారీకి నిధులు సమకూరతాయి. కొత్త ఇంజిన్, నూతన నమూనా, కొత్త లోహ మిశ్రమాల తయారీకి ఫ్రాన్స్ సహకరిస్తుంది. అయితే, అనేక సవాళ్ల వల్ల ఈ
ప్రాజెక్టు ఆలస్యమవుతూనే ఉంది. ఏరోథర్మల్ డైనమిక్స్, లోహమిశ్రమాలు, స్క్రాచ్ కంట్రోల్ సిస్టమ్ వంటి అధునాతన సాంకేతికతను అభివృద్ధి చేయడం కష్టతరంగా మారింది. సింగిల్ క్రిస్టల్ బ్లేడ్ను
తయారీపై పశ్చిమ దేశాల పట్టు, నైపుణ్యాలు కలిగిన మానవ వనరులు లేకపోవడం కూడా సమస్యగానే ఉంది. వీటిని అధిగమించేలా కావేరి ప్రాజెక్టుకు నిధులు, వనరులు సమకూర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని రక్షణ రంగ
నిపుణులు కోరుతున్నారు. ‘ఆపరేషన్ సిందూర్’తో సైనిక సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన భారత్.. సాంకేతికతలోనూ పరిపూర్ణమైన ఆత్మనిర్భరత సాధించాలని ఆశిద్దాం..!