Play all audios:
Adampur Airbase | ఇంటర్నెట్డెస్క్: పాక్ ఆర్మీ ప్రధాన కార్యాలయానికి కూతవేటు దూరంలోని నూర్ఖాన్ ఎయిర్బేస్ను భారత్ దిమ్మతిరేగే దెబ్బకొట్టింది. దీనికి ప్రతిగా భారత్లోని ఆదంపుర్ ఎయిర్
బేస్పై దాడి చేసి ఎస్-400పై దాడి చేశామంటూ తప్పుడు ప్రచారం మొదలుపెట్టింది. దీనిని తిప్పికొట్టేలా ఇటీవల ప్రధాని మోదీ స్వయంగా ఆదంపుర్ను సందర్శించి.. ఎస్-400, మిగ్-29లు సురక్షితమే అని
ప్రపంచానికి చూపారు. వ్యూహాత్మకంగా ఆదంపుర్ వైమానిక స్థావరానికి చాలా ప్రాధాన్యం ఉంది. భారత్-పాక్ మధ్య జరిగిన ప్రతీ యుద్ధంలో ఇది శత్రుదేశానికి తొలి లక్ష్యంగా మారినా.. దాడులకు తట్టుకొని
గంభీరంగా నిలిచింది. ఎందుకంత ప్రాధాన్యం..! ఆదంపుర్ వాయుసేన స్థావరాన్ని 1950ల్లో ఏర్పాటుచేశారు. ఇది పంజాబ్లోని జలంధర్ నగరానికి అత్యంత సమీపంలో ఉంటుంది. ఇక్కడి నుంచి పాకిస్థాన్ కేవలం 100
కిలోమీటర్ల దూరం. దేశంలోని రెండో అతిపెద్ద వైమానిక స్థావరం. ఇది 75 ఏళ్లుగా పాక్ రాడార్ గురిలో ఉన్నా.. చెక్కుచెదరని ఉక్కుశిల్పంలా నిలిచింది. పాక్ ఎప్పుడూ దీని భద్రతా వ్యవస్థలోకి చొరబడాలని
ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఈనెల 9-10 తేదీల్లో పాక్ దాదాపు 6 క్షిపణులను ప్రయోగించగా.. మొత్తాన్ని దాదాపు ఏడు కిలోమీటర్ల దూరంలోనే భారత్ కూల్చేసింది. ‘బ్లాక్ ఆర్చర్స్’ అడ్డా.. ఈ స్థావరం
వాయుసేనకు చెందిన 47వ స్క్వాడ్రన్కు అడ్డా. దీనిని బ్లాక్ ఆర్చర్స్ అని కూడా పిలుస్తుంటారు. దీంతోపాటు ‘ఫస్ట్ సూపర్సోనిక్స్’గా పేరున్న 28వ స్క్వాడ్రన్ ఇక్కడే ఉంటుంది. ఈ స్థావరం రోజువారీ
కార్యకలాపాలకు ఈ రెండు అత్యంత కీలకమైనవి. భౌగోళికంగా కీలక స్థానం.. వ్యూహాత్మకంగా ఆదంపుర్ కీలక స్థానం. దీని చుట్టుపక్కల దాదాపు 150 కిలోమీటర్ల లోపే.. ఆపాచీ హెలికాప్టర్లు ఉన్న పఠాన్కోట్,
సుఖోయ్-30 ఎంకేఐలు ఉన్న హల్వార, పాక్ సరిహద్దుల్లోని అమృత్సర్, రఫేల్స్ కేంద్రమైన బఠిండా, ఛండీఘడ్ వాయుసేన స్థావరాలున్నాయి. వీటన్నింటిని గ్రిడ్ వలే కలుపుతూ ఆదంపుర్ ఎయిర్బేస్ ఉంది.
ఈనేపథ్యంలో ఎస్-400 గగనతల రక్షణవ్యవస్థ తొలి రెజిమెంట్ను ఇక్కడే మోహరించారు. దీంతో పశ్చిమ సరిహద్దులు దీని రక్షణ ఛత్రం కిందకు వచ్చాయి. యుద్ధాల సమయంలో.. 1965లో పాక్ వాయుసేన ఆదంపుర్పై
ముందస్తు దాడి చేసింది. ఆ తర్వాత 135 స్పెషల్ సర్వీస్ గ్రూప్ పారా కమాండోలను ఇక్కడ ఎయిర్ డ్రాప్ చేసింది. కానీ, భారత్లోని గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఆ కమాండోల్లో చాలామందిని పట్టుకొని మన
దళాలకు అప్పగించారు. మిగిలిన కమాండోలు పాకిస్థాన్కు పారిపోయారు. అప్పట్లో ఈ ఎయిర్బేస్లో వాయుసేన 1వ స్క్వాడ్రన్ ఉండేది. అది సర్గోదా సహా ఇతర కీలక పాక్ వాయుసేన స్థావరాలను ధ్వంసం చేసింది.
ఇక 1971 యుద్ధ సమయంలో పఠాన్కోట్లోని రన్వేను పాక్ ధ్వంసం చేయగా.. ఆదంపుర్ నుంచి యుద్ధవిమానాలు గాల్లోకి ఎగిరి.. ఆ ఎయిర్బేస్కు రక్షణ కల్పించాయి. ఈ యుద్ధం మొత్తంలో పూర్తి శక్తి సామర్థ్యాలతో
ఇది పనిచేస్తుంది. ఇక 1999 కార్గిల్ యుద్ధంలో ఇక్కడినుంచి మిరాజ్ 2000 విమానాలు బయల్దేరి శత్రుబంకర్లను ధ్వంసం చేశాయి. టైగర్ హిల్స్, టోలోలింగ్ శిఖరాల స్వాధీనంలో కీలక పాత్ర పోషించింది.