Play all audios:
ఇంటర్నెట్డెస్క్: తెలుగు సినీ పరిశ్రమలో ఓ కీలక సమావేశం శనివారం ప్రారంభమైంది. మల్టీప్లెక్స్లకు ఇస్తున్న పర్సంటేజ్ విధానాన్నే సింగిల్ స్క్రీన్ థియేటర్లలోనూ అమలుచేయాలని తెలుగు సినీ
ఎగ్జిబిటర్లు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. లేకపోతే, జూన్ 1 నుంచి మూవీ థియేటర్లు బంద్ పాటిస్తాయని హెచ్చరిస్తున్నారు. ఈక్రమంలో శనివారం ఫిల్మ్ఛాంబర్లో ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లతో
తెలుగు సినీనిర్మాతలు సమావేశమయ్యారు. దిల్రాజు, ఏఎం రత్నం, నాగవంశీ, సురేష్బాబు, మైత్రీ మూవీ మేకర్స్ రవి సహా పలు అగ్ర ప్రొడక్షన్స్ నిర్మాతలు, అలాగే, జూన్ నెలలో విడుదలయ్యే సినిమాలకు
సంబంధించిన నిర్మాతలు ఇందులో పాల్గొన్నారు. ప్రధాన డిమాండ్ ఇదే! థియేటర్లలో పర్సంటేజ్ విధానాన్ని అమలుచేయాలని గత రెండు, మూడు నెలల నుంచి ఎగ్జిబిటర్లు కోరుతున్నారు. ఇతర రాష్ట్రాల్లో
అనుసరిస్తున్న విధానాన్నే ఇక్కడ కూడా కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. మల్టీప్లెక్స్ల్లో పర్సంటేజ్ విధానంలో నిర్మాతలు డబ్బులు చెల్లిస్తున్నారని, అలాగే, సింగిల్ స్క్రీన్ థియేటర్లలోనూ
ఇలాగే కొనసాగించాలంటున్నారు. ఈవిషయమై నిర్మాతలు, ఫిల్మ్ ఛాంబర్కు లేఖలు రాస్తూ వస్తున్నారు. ఫిల్మ్ ఛాంబర్ చొరవ తీసుకొని నిర్మాతలు, ఎగ్జిబిటర్లకు మధ్య సమస్యను పరిష్కరించే ప్రయత్నం
మొదలుపెట్టింది. సరిగ్గా ఇదే సమయంలో జూన్ 1 నుంచి థియేటర్లు మూసివేస్తామని ఎగ్జిబిటర్లు ప్రకటించడంతో ఈ అంశం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైంది. జూన్లో ‘హరిహరవీరమల్లు’, ‘కుబేర’ సహా పలు
ఆసక్తికర చిత్రాలు వస్తుండటంతో పరిశ్రమ వర్గాల్లో చర్చకు దారితీసింది. రాజకీయ అంశంగానూ మారింది. అలాంటి వ్యక్తులను ఊరుకునేది లేదు చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితిపై ఏపీ సినిమాటోగ్రఫీ
మంత్రి కందుల దుర్గేష్ ఘాటుగా స్పందించారు. చిత్ర పరిశ్రమ ఒక్కతాటిపై ఉంటుందని, అలాంటి దాన్ని చిన్నాభిన్నం చేసే వ్యక్తులను ఊరుకునేది లేదని హెచ్చరించారు. మరోవైపు పెద్ద సినిమాలు వచ్చినప్పుడే
ప్రేక్షకులు వస్తున్నారని, చిన్న సినిమాలకు సరైన ఆక్యుపెన్సీ లేకపోవడంతో ఆర్థికంగా నష్టపోతున్నామని డిస్ట్రిబ్యూటర్లు వాపోతున్నారు. పర్సంటేజీ విధానం ద్వారా సింగిల్ స్క్రీన్లు మరింతకాలం
బతుకుతాయని అంటున్నారు. పెద్ద సినిమా అయితే, మొదటివారం 70శాతం నిర్మాతకు, 30శాతం థియేటర్కు వాటా ఉండేలా నిర్ణయం తీసుకోవాలని పట్టుబడుతున్నారు. దీనిపై ప్రస్తుతం చర్చలు ఇంకా కొనసాగుతున్నాయి.
శనివారం తెలుగు సినీ నిర్మాతలతో కలిసి సమస్యకు పరిష్కారం తీసుకొచ్చేలా ఫిల్మ్ ఛాంబర్ ఈ సమావేశం నిర్వహిస్తోంది. దీంతో పాటు, ఎగ్జిబిటర్ రంగాన్ని స్ట్రీమ్లైన్ చేయడం, నిర్దిష్ట టికెట్ ధరను
నిర్ణయించడం సహా పలు అంశాలపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు.