Play all audios:
హైదరాబాద్: నైజాంలో మొత్తం 370 సింగిల్ థియేటర్లు ఉంటే, ఎస్వీసీఎస్, తమకు సంబంధించినవి కేవలం 30 మాత్రమే ఉన్నాయని ప్రముఖ నిర్మాత దిల్రాజు (Dil Raju) అన్నారు. ఏపీ ప్రభుత్వం, తెలుగు సినీ
పరిశ్రమ మధ్య నెలకొన్న తాజా పరిస్థితుల నేపథ్యంలో ఆయన సోమవారం విలేకరులతో (Dil Raju Press Meet) మాట్లాడారు. ‘‘కొన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సి ఉంది కాబట్టి, ఈ ప్రెస్మీట్ ఏర్పాటు చేశా.
అసలైన విషయం పక్కదారి పట్టకుండా వివాదాస్పద ప్రశ్నలకు తావులేకుండా దీన్ని కొనసాగిద్దాం. పర్సంటేజీల విషయంలో ఎగ్జిబిటర్లకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఏప్రిల్లో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన
కొందరు ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు ఈ అంశాన్ని మా దృష్టికి తీసుకొచ్చారు. వాళ్ల కష్టాలు మాకు తెలుసు. గత ఆరు నెలలుగా వస్తున్న రెవెన్యూ గురించి ఈ సందర్భంగా వారిని అడిగాం. పర్సంటేజీ విధానం
ఉంటే బాగుంటుందని వారు చెప్పారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో రెంట్ OR పర్సంటేజీ విధానం నడుస్తోంది. మొదటి వారం బాగా రెవెన్యూ వస్తే.. రెంట్ ఇస్తున్నాం. సెకండ్ వీక్ కలెక్షన్లు తగ్గగానే పర్సంటేజీ
ఇస్తున్నా. అది వాళ్లకు కష్టమైనదే. అది మా అందరికీ తెలుసు. దీనిపై చర్చిస్తున్నాం. కానీ, ఓ కొలిక్కి రాలేదు’’ వ్యక్తిగతంగా దాడి చేస్తున్నారు ‘‘సరిగ్గా అదే సమయంలో ‘హరి హర వీరమల్లు’ విడుదల తేదీని
ప్రకటించారు. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల అది వాయిదా పడింది. తర్వాత డేట్ను వాళ్లు లాక్ చేయలేదు. పర్సంటేజీ సమస్య ఈస్ట్ గోదావరి నుంచి మొదలై నైజాంకు కూడా వచ్చింది. నైజాంలో 370 సింగిల్
స్క్రీన్ థియేటర్లు ఉంటే, ఎస్వీసీఎస్ సహా మా వద్ద ఉన్న థియేటర్లు 30 మాత్రమే. ఏషియన్, సురేశ్ కంపెనీలో 90 ఉన్నాయి. 250 థియేటర్లు ఓనర్లు, వాళ్లకు సంబంధించిన వాళ్లు మాత్రమే నడుపుతున్నారు. ‘ఆ
నలుగురు’ అంటూ మీడియా ఇష్టం వచ్చినట్లు రాస్తోందని ఈ విషయంలో క్లారిటీ ఇస్తున్నాం. వ్యక్తిగతంగా దాడి చేస్తున్నారు. ఇప్పుడు క్లారిటీ తీసుకోండి’’ ఇండస్ట్రీలో ఎవరి దారి వారిదే! ‘‘పర్సంటేజీ అంశం
తెలంగాణకు వచ్చినప్పుడు ఇక్కడి ఎగ్జిబిటర్లు దానిని శిరీష్ దృష్టికి తీసుకొచ్చారు. 20 ఏళ్ల నుంచి ఆ ఎగ్జిబిటర్లతో మాకు వ్యాపారం అనుబంధం ఉంది. వాళ్లకు ఏం కావాలో అడగటం తప్పు లేదు. మే 18న ఏపీ,
తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశం జరిగింది. వాళ్ల సమస్యలు, డిమాండ్లను నిర్మాతలకు చెప్పమని నేను సూచించాను. అక్కడున్న వాళ్లలో కొందరు ‘ఈ సమస్యకు పరిష్కారం దొరక్కపోతే, జూన్ 1 నుంచి థియేటర్లు బంద్
చేస్తా’మని అన్నారు. వెంటనే నేను వద్దని వారించాను. నా నిర్ణయంతో వాళ్లు ఏకీభవించారు. అయితే, ఛాంబర్ మీటింగ్లో ఏం జరిగిందో తెలియకుండానే మీడియాలో వార్తలను ప్రచురించారు. ఆ తర్వాత వాళ్లు పర్సంటేజీ
విషయంలో ఛాంబర్కు లేఖ రాశారు. డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలతో మీటింగ్ పెట్టాలని, ఒకవేళ ఆ సమావేశంలో తమ డిమాండ్లు నెరవేరకుంటే థియేటర్లు బంద్ చేస్తామని మాత్రమే అన్నారు. అసలు మీటింగ్ జరగకుండా
జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ అంటూ మీడియాలో బ్రేకింగ్లు వేయడం ఎంత వరకూ సమంజసం. ఈ వార్తలను అటు ఎగ్జిబిటర్లు, ఇటు ఛాంబర్ ఖండించలేదు. ఇండస్ట్రీలో ఎవరి దారి వారిదే. నిన్న అరవింద్గారు, (allu
aravind press meet) నేడు నేను ప్రెస్మీట్ పెట్టాం. ఇండస్ట్రీలో ఉన్న అందరం కలిసి కదా మీడియాతో మాట్లాడాల్సింది. అంతా కలిసి మాట్లాడాలంటే మాకు భయం’’ పవన్ సినిమాలను ఆపే దమ్ము ఎవరికీ లేదు
‘‘నాకు తెలిసి ఇప్పటివరకూ కొవిడ్ సమయంలో తప్ప ఎప్పుడూ థియేటర్లు మూతపడలేదు. బంద్ ప్రస్తావన వచ్చినప్పుడు ‘56 రోజులు చిత్ర పరిశ్రమలో షూటింగ్ ఆపేసి ఏం సాధించలేకపోయా’మని ఎగ్జిబిటర్లతో చెప్పాను.
ఇటీవల జరిగిన మీటింగ్లో నిర్మాతలందరం కలిసి ఎగ్జిబిటర్ల సమస్యలపై చర్చించాం. ఈ సమస్యకు ఒక పరిష్కారం చూడాలని అనుకున్నాం. ఈలోగా ఈ ఎపిసోడ్ మరోవైపు మలుపు తిరిగింది. కల్యాణ్గారు (Pawan Kalyan)
నటించిన ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) విషయంలో తప్పుగా వెళ్లింది. ఆయన సినిమాలను ఆపే దమ్ము, ధైర్యం ఎవరికీ లేదు. ప్రభుత్వానికి కూడా ఆ సమాచారాన్ని తప్పుగా చెప్పారు. మంత్రి దుర్గేష్
గారు నాకు ఫోన్ చేస్తే థియేటర్లు మూసివేయరని స్పష్టంగా చెప్పా. తప్పుడుగా సమాచారం వచ్చిందని ఆయనకు వివరించా. మే 30న భైరవం, జూన్ 5న ‘థగ్లైఫ్’, జూన్ 12 ‘హరి హర వీరమల్లు’, (Hari hara veera
mallu release date) జూన్ 20 ‘కుబేర’, జులై 4న ‘కింగ్డమ్’ ఇలా జూన్, జులై నెలల్లో పెద్ద సినిమాలున్నాయి. ఈ సమయంలో సినీ పరిశ్రమను ఎలా కాపాడుకోవాలనేదే మా అందరి తపన’’ * పవన్ మూవీ వేళ అది
దుస్సాహసమే.. ఆ నలుగురిలో నేను లేను: అల్లు అరవింద్ అంతకుముందు భయపడుతూ ఉండేవాళ్లం ‘‘జూన్, జులై, ఆగస్టు సినిమాలకు కీలక సీజన్. ఈస్ట్ గోదావరిలో ఓ వ్యక్తితో మొదలైన సమస్య తెలంగాణకు ఆపాదించారు.
సినిమా వాళ్లకు రెండు ప్రభుత్వాలు చాలా ముఖ్యం. సినీ పరిశ్రమకు, ప్రభుత్వానికి మధ్యలో అనుసంధానంగా ఉండాలనే సీఎం రేవంత్రెడ్డి నన్ను ఎఫ్డీసీ ఛైర్మన్గా పెట్టారు. ఏపీలో అంతకుముందు ప్రతిదానికి
భయపడుతూ ఉండేవాళ్లం. కల్యాణ్గారు పిలిస్తే అందరం వెళ్లి కలిశాం. ఆయన సహకారం మర్చిపోలేము. ‘సినిమా ఇండస్ట్రీకి ఏపీ ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుంది’ అని కల్యాణ్గారు చెప్పాక పక్కింటికి
వెళ్లినంత సులభంగా వెళ్లి పేపర్ పట్టుకొని టికెట్ ధరలు పెంచుకొని వస్తున్నారు’’ ‘‘అందరం కలిసి ఐక్యంగా ఉండాలనే ఆలోచన మా ఇండస్ట్రీలో ఉండదు. ఎవరికి సినిమా వచ్చినప్పుడు వాళ్లు మేల్కొని, టికెట్
ధరలు పెంచుకునేందుకు పరిగెత్తుకుంటూ వెళ్తారు. ఉత్తరాంధ్రలో మాకు డిస్ట్రిబ్యూషన్ ఆఫీసు ఉంది. అక్కడ 20 థియేటర్లు ఉన్నాయి. రెండు ప్రభుత్వాలు సినీ పరిశ్రమకు అండగానే ఉన్నాయి. నేను ఇంకా కొత్త కొత్త
ఆలోచనలు చేస్తున్నా. కొత్త టాలెంట్ను ప్రోత్సహించాలని దిల్ రాజు డ్రీమ్స్ (dil raju dreams), ఏఐ టెక్నాలజీని ఇండస్ట్రీకి తీసుకురావాలని భావిస్తున్నా. ఇండస్ట్రీకి ఏ సమస్య వచ్చినా, ప్రభుత్వాలే
పరిష్కరించాలి. ఈ ఎపిసోడ్తో ఇప్పటికైనా తెర దించుదాం’’ అని దిల్రాజు అన్నారు.