Play all audios:
కాలిఫోర్నియా: తెదేపా వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ 102వ జయంతి వేడుకలతోపాటు ‘ మినీ మహానాడు-2025’ కార్యక్రమాన్ని కాలిఫోర్నియాలోని ఫ్రీమాంట్లో ఘనంగా నిర్వహించారు. ఎన్నారై తెదేపా నేత
శ్రీకాంత్ దొడ్డపనేని ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల నుంచి పలువురు తెదేపా ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, వర్చువల్గా హాజరయ్యారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్,
కర్నూలు ఎంపీ నాగరాజు, పొలిట్ బ్యూరో సభ్యుడు నక్కా ఆనందబాబు, తుడా ఛైర్మన్ డాలర్స్ దివాకర్రెడ్డి, తెదేపా బ్రాహ్మణ సాధికార సమితి, తెదేపా స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ బుచ్చి రాం ప్రసాద్..
తెదేపా జాతీయ అధికార ప్రతినిధి జ్యోత్స్న, భారాస నేత ఎల్. రమణ, ఎన్నారై తెదేపా అధ్యక్షుడు రవి వేమూరు, ఎన్నారై తెదేపా యూఎస్ కో-ఆర్డినేటర్ జయరాం కోమటి తదితరులు గెస్ట్ స్పీకర్లుగా వర్చువల్గా
హాజరయ్యారు. ఈ సందర్భంగా జయరాం కోమటి మాట్లాడుతూ.. ప్రపంచ వ్యాప్తంగా తెలుగుజాతి సత్తా చాటడానికి కారణం ఎన్టీఆర్ అని ప్రశంసించారు. ఎన్టీఆర్ అడుగు జాడల్లో నడిచిన చంద్రబాబు ఐటీ రంగానికి
ఊతమిచ్చారని కొనియాడారు. అమెరికాలో మినీ మహానాడు గ్రాండ్ సక్సెస్ అయిందని డాక్టర్ రవి వేమూరు అన్నారు. తెలుగు జాతి తలెత్తుకొని తిరిగేలా చేసిన ఘనత ఎన్టీఆర్దని కొనియాడారు. ఎన్టీఆర్ ఆశయాల సాధనకు
తమ వంతు కృషి చేస్తామని, సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ అడుగుజాడల్లో నడుస్తామని అన్నారు. నవ్యాంధ్ర అభివృద్ధికి ఎన్నారైలు తమ వంతు సహకారం అందిస్తున్నారని మంత్రి కొండపల్లి శ్రీనివాస్
కొనియాడారు. భవిష్యత్తులో ఏవిధమైన సహాయ సహకారాలు అందించబోతున్నారన్న విషయాలపై ఎన్నారైలతో మాట్లాడారు. ఏవైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని, వాటి పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు.
ఎన్టీఆర్ వల్లే బీసీలకు రాజ్యాధికారం దక్కిందని ఎంపీ నాగరాజు అన్నారు. మంత్రి నారా లోకేశ్ను తెదేపా కార్యనిర్వాహక అధ్యక్షుడిగా చూడాలని కోరుకుంటున్నామని జ్యోత్స్న అన్నారు. ఆంధ్రాలో
జరిగినట్లుగానే అమెరికాలోనూ మినీ మహానాడును గ్రాండ్ గా సెలబ్రేట్ చేసి సక్సెస్ చేశారని ప్రశంసించారు. మంత్రి లోకేశ్ ప్రతిపాదించిన 6 శాసనాలు: 1. తెలుగుజాతి విశ్వఖ్యాతి, 2. యువగళం, 3. స్త్రీ
శక్తి, 4. పేదల సేవల్లో సోషల్ రీఇంజనీరింగ్, 5. అన్నదాతకు అండగా, 6. కార్యకర్తే అధినేత, సీఎం చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పీ-4 కార్యక్రమానికి ఎన్నారైల సహకారం, ఎన్టీఆర్కు భారతరత్న
ఇవ్వాలని విజ్ఞప్తి తదితర 8 అంశాలతో ఎన్నారై టీడీపీ నేత శ్రీకాంత్ దొడ్డపనేని తీర్మానం ప్రవేశ పెట్టారు. ఆ తీర్మానానికి సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపి తెదేపా కేంద్ర కార్యాలయానికి పంపించారు. ఈ
ఆరు సూత్రాల అమలుకు, పీ-4 కార్యక్రమానికి తమ వంతు సహాయసహకారాలు అందిస్తామని పార్టీ నేతలంతా ప్రతిజ్ఞ చేశారు. మినీ మహానాడుకు అనూహ్యమైన స్పందన వచ్చిందని, భారీ సంఖ్యలో ఎన్నారైలు తరలి రావడం
సంతోషాన్నిచ్చిందని శ్రీకాంత్ దొడ్డపనేని హర్షం వ్యక్తం చేశారు. వెంకట్ అడుసుమల్లి, శశి దొప్పలపూడి, మురళి గొడవర్తి, చంద్ర గుంటుపల్లి, సురేష్ పోతినేని, సుబ్బా యంత్ర, భాస్కర్ వల్లభనేని, శివ
ప్రసాద్ పరుచూరి, లక్ష్మణ్ పరుచూరి, ఎంవి రావు, రాజ మహాదాస్, రవి ఆలపాటి, విజేత శ్రీనివాస్, నారాయణ రావరపు, సందీప్ ఇంటూరి, సుధీర్ ఉన్నం, తిరుపతి రావు వలివేటి, సతీష్ బోళ్ల , ప్రకాష్ మద్దిపాటి,
హరికృష్ణ గురజాల, శ్రీహర్ష యడ్లపాటి, వంశీ పాలడుగు, ఆదినారాయణ, నారాయణ రావరపు, బాలకృష్ణ కంతేటి, భరత్ ముప్పిరాల, అశోక్ మైనేని, రవి కిరణ్ ఆలేటి, మోహన్ మల్లంపాటి, హర్ష యడ్లపాటి, నవీన్ కొడాలి,
సాగర్ దొడ్డపనేని, రహరి మర్నేని, హరిబాబు బొప్పుడి తదితరులు పాల్గొన్నారు.