Play all audios:
ఇంటర్నెట్డెస్క్: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ (Elon Musk) కొన్ని రకాల డ్రగ్స్ను వినియోగిస్తున్నారంటూ ఓ అంతర్జాతీయ మీడియాలో కథనం వచ్చింది. దీనిపై ఆయనకు ప్రశ్న ఎదురైంది. వైట్హౌస్లో
ఉన్నప్పుడు కూడా డ్రగ్స్ను వినియోగించారా? అని ఓ విలేకరి ప్రశ్నించగా, అది తప్పుడు కథనాలు రాసిన మీడియా సంస్థ అని మండిపడ్డారు. డోజ్ శాఖ నుంచి వైదొలిగిన నేపథ్యంలో ఓవల్ ఆఫీసులో ప్రపంచ కుబేరుడు
ఎలాన్ మస్క్కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. డొనాల్డ్ ట్రంప్నకు సన్నిహిత సలహాదారుల్లో ఒకరిగా ఉన్నప్పుడు మస్క్.. విపరీతంగా మాదక
ద్రవ్యాలను వినియోగించారని, కెటమిన్ (Ketamine) తరచుగా తీసుకునేవారని న్యూయార్క్ టైమ్స్ తన కథనంలో పేర్కొంది. దానివల్ల మూత్రాశయ సంబంధిత సమస్యలు వచ్చాయని, ఆయన వెంట ఎప్పుడూ సుమారు 20 పిల్స్
ఉండేవని రాసుకొచ్చింది. ట్రంప్ అధ్యక్ష ఎన్నికల ప్రచారంలోనూ, డోజ్కు నాయకత్వం వహించిన సమయంలోనూ వీటి వినియోగం ఎక్కువైందని చెప్పింది. అమెరికా ప్రభుత్వం నుంచి వైదొలిగిన తరుణంలో ఈ కథనం రావడం
సంచలనంగా మారింది. * తలుపులు వేసుకోవడం మర్చిపోవద్దు.. మెక్రాన్ దంపతుల గొడవపై ట్రంప్ గతంలో తన మాదక ద్రవ్యాల వినియోగం గురించి మస్క్ వెల్లడించిన సంగతి తెలిసిందే. మానసిక కుంగుబాటు నుంచి
బయటపడేందుకు వైద్యుడి సూచన మేరకు కెటమిన్ (Ketamine) అనే డ్రగ్ను తీసుకున్నట్లు చెప్పారు. ‘‘అప్పట్లో రోజుకు 16 గంటలు పని చేసేవాణ్ని. దాంతో నాపై తీవ్ర ఒత్తిడి ఉండేది. నేను ఎక్కువకాలం మానసిక
కుంగుబాటులో ఉంటే టెస్లా పనితీరుపై ప్రభావం పడుతుంది. దానిని అధిగమించేందుకే కెటమిన్ తీసుకున్నా. ఒకవేళ ఎవరైనా దానిని పరిమితికి మించి ఉపయోగిస్తే ఏ పనీ సక్రమంగా పూర్తి చేయలేరు’’ అని
వెల్లడించారు. ప్రపంచంలో వివిధ ప్రాంతాల్లో జరిగే పార్టీల్లో మస్క్ తరచుగా పాల్గొంటూ.. నిషేధిత డ్రగ్స్ను తీసుకుంటున్నారని, ఈ విషయంపై టెస్లా, స్పేస్ఎక్స్ సంస్థల బోర్డు సభ్యులు ఆందోళన
వ్యక్తంచేశారని గతంలోనూ ఓ మీడియా సంస్థ ప్రచురించిన కథనంపై ఆ సమాధానం ఇచ్చారు. అమెరికా అధ్యక్ష సలహాదారుగా వైదొలుగుతున్నట్లు ప్రకటించిన ఎలాన్ మస్క్ (Elon Musk)కు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
(Donald Trump) వీడ్కోలు పలికారు. ‘డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ’ (DOGE) సారథిగా ఎలాన్ మస్క్ సేవలు అందించిన విషయం తెలిసిందే. మే 30న తన పదవికి చివరిరోజు కావడంతో అధ్యక్షుడు
ట్రంప్ కార్యాలయానికి ఎలాన్ మస్క్ వెళ్లారు. ఆ సమయంలో కుబేరుడి కంటిపై ఒక నల్లని గాయం కనిపించింది. ఆ ఫొటో నెట్టింట్లో విపరీతంగా వైరల్ అయింది. తన కుమారుడు ‘ఎక్స్’ పంచ్ చేయడం వల్లే ఆ మచ్చ
ఏర్పడిందని సమాధానం ఇచ్చారు. అలాగే తాను ఫ్రాన్స్ దగ్గర్లోకి ఏమీ వెళ్లలేదని చమత్కారం చేశారు. ఇటీవల ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ దంపతుల మధ్య జరిగిన గొడవలను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు.
అయితే డ్రగ్స్ వినియోగం గురించి వార్తలు వచ్చినప్పుడే ఈ గాయం కనిపించడంపై నెటిజన్లు అనుమానాలు వ్యక్తంచేశారు.