Play all audios:
Pakistan ఇంటర్నెట్డెస్క్: సింధూ జలాలే పాక్కు ఎర్రగీత అని.. దానిపై ఎటువంటి రాజీ లేదని పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ మరోసారి ప్రేలాపనలు పేలారు. పాక్లోని వివిధ విశ్వవిద్యాలయాల
ఉపకులపతులు, ప్రధాన అధ్యాపకులు, సీనియర్ అధ్యాపకుల సమావేశంలో ఆయన ప్రసంగించారు. ‘‘నీరే పాకిస్థాన్ రెడ్లైన్.. 24 కోట్ల మంది దేశవాసుల ప్రాథమిక హక్కు అయిన దానిపై ఎటువంటి రాజీని అనుమతించం.
కశ్మీర్పై ఎటువంటి ఒప్పందాలు సాధ్యం కావు. కశ్మీర్ను మేం ఎప్పటికీ మర్చిపోం. నేను ప్రస్తుతం ఈ స్థితిలో ఉన్నానంటే అది మా తల్లిదండ్రులు, టీచర్ల వల్లే. పాకిస్థాన్ గాథను కచ్చితంగా తర్వాత తరాలకు
చేరవేయాలి. వారి వ్యక్తిత్వాలను మలచడం మీ బాధ్యత. బలోచ్ వేర్పాటువాదం పూర్తిగా విదేశీయులదే.. స్థానిక ప్రజలతో దానికి సంబంధం లేదు’’ అని వ్యాఖ్యానించారు. వాస్తవానికి పహల్గాం ఉగ్రదాడిని
ప్రేరిపించింది కొన్నాళ్ల క్రితం అసీం మునీర్ ‘కశ్మీర్ జీవనాడి’ అంటూ చేసిన ప్రసంగమే అన్న విమర్శలూ ఉన్నాయి. ఈ ఉగ్రదాడి తర్వాత భారత్ 1960ల నాటి సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది. నాటినుంచి
పాకిస్థానీ నేతలు భారత్పై తరచూ బెదిరింపులకు దిగుతున్నారు. ఒప్పందం జరిగిన నాటినుంచి సస్పెండ్కు గురికావడం ఇదే తొలిసారి. అనంతరం పాక్లోని ఉగ్రస్థావరాలను భారత్ ధ్వంసం చేయడం.. అనంతరం ఇరుదేశాల
సైనిక ఘర్షణ చోటుచేసుకొన్నాయి. దీనిలో దాదాపు 8కి పైగా పాక్ సైనిక స్థావరాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. సింధు, దాని ఉపనదుల జలాలను పంచుకోవడానికి ప్రపంచబ్యాంకు మధ్యవర్తిత్వంతో భారత్, పాకిస్థాన్ల
మధ్య ఒప్పందం కుదిరింది. దీనిపై 1960 సెప్టెంబరులో నాటి భారత ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ, పాకిస్థాన్ అధ్యక్షుడు అయూబ్ఖాన్ సంతకాలు చేశారు. ఒప్పందం ప్రకారం సింధు ఉపనదుల్లో తూర్పున పారే
రావి, బియాస్, సట్లెజ్ నదులపై భారతదేశానికి హక్కులు లభించాయి. వీటి సగటు వార్షిక ప్రవాహం 33 మిలియన్ ఎకరాల అడుగులు (ఎమ్ఏఎఫ్)గా ఉంది. సింధు నదితోపాటు దాని పశ్చిమ ఉపనదులైన జీలం, చీనాబ్లపై
పాకిస్థాన్కు హక్కులు దక్కాయి. వీటి సామర్థ్యం 135 ఎంఏఎఫ్గా ఉంది.