Play all audios:
హైదరాబాద్: ప్రధానిగా దేశానికే వన్నె తెచ్చిన మహా నాయకుడు రాజీవ్గాంధీ అని తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి (Revanth Reddy) అన్నారు. రాజీవ్గాంధీ వర్ధంతి సందర్భంగా సచివాలయం వద్ద విగ్రహానికి
నివాళులర్పించిన అనంతరం మాట్లాడారు. ఆర్థిక, సరళీకృత విధానాలతో భారత్ను బలమైన దేశంగా రాజీవ్గాంధీ నిలబెట్టారన్నారు. 18 ఏళ్లకే ఓటు హక్కును కల్పించి ప్రభుత్వాల ఏర్పాటులో యువతకు భాగస్వామ్యం
కల్పించారని చెప్పారు. ‘‘పహల్గాం ఘటన నేపథ్యంలో దివంగత ప్రధాని ఇందిరా గాంధీ స్ఫూర్తిని దేశంలో ప్రతిఒక్కరూ గుర్తు తెచ్చుకున్నారు. దేశ పౌరులపై దాడులకు తెగబడితే ఆనాడు ఇందిరమ్మ పాకిస్థాన్కు
గుణపాఠం చెప్పారు. మా దేశాన్ని మేం రక్షించుకోగలుగుతాం.. ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదని ఆమె ఆనాడే స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెబితే కాల్పుల విరమణ చేసిన పరిస్థితి ఇప్పటి కేంద్ర
ప్రభుత్వానిది. రాహుల్ గాంధీని విమర్శించడం ద్వారా భాజపా నాయకులు తమ చేతగానితనాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. కేంద్రానికి అండగా నిలబడాల్సిన సమయంలో కేంద్రమంత్రి కిషన్రెడ్డి బయటకు
రాలేదు. మేం బయటకు వచ్చి మద్దతు తెలిపాం. ఆనాడు కనీసం మమ్మల్ని అభినందించని వ్యక్తి.. ఈరోజు రాహుల్ గాంధీని విమర్శిస్తున్నారు. తన చేతగానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకే కిషన్రెడ్డి విమర్శలు
చేస్తున్నారు. సెక్రటేరియట్ దగ్గర రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే కొందరు విమర్శలు చేశారు. సంకుచిత మనస్తత్వం కలిగిన కొందరు ఆ వ్యాఖ్యలు చేశారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన చరిత్ర గాంధీ
కుటుంబానిది, కాంగ్రెస్ పార్టీది. దేశ రక్షణ కోసం భారత జవాన్లకు అండగా నిలబడతాం.. అది మా బాధ్యత. దేశ సమగ్రత విషయంలో మేం రాజకీయాలు చేయం.. దేశ భద్రతకు కట్టుబడి పనిచేస్తాం’’ అని రేవంత్రెడ్డి
తెలిపారు.(Telangana News)