Neha bhandari: కళ్లెదుటే శత్రువున్నా వెరవని నారీమణి.. ‘సిందూర్‌’కు సిసలైన అర్థం నేహా భండారి

Neha bhandari: కళ్లెదుటే శత్రువున్నా వెరవని నారీమణి.. ‘సిందూర్‌’కు సిసలైన అర్థం నేహా భండారి

Play all audios:

Loading...

జమ్మూ: కంటికి కన్పించేంత దూరంలో శత్రువు.. దాడుల రూపంలో ముంచుకొస్తున్న ముప్పు.. అలాంటి సమయంలో ప్రత్యర్థికి ఎదురొడ్డి పోరాడటం అంటే అంత సులువైన విషయం కాదు. కానీ, ఆమె ఎదురునిలవడమే గాక.. తన


సైన్యంతో శత్రుమూకలను తరిమికొట్టింది. ఆమే అసిస్టెంట్‌ కమాండెంట్‌ నేహా భండారి (Neha Bhandari). ఆపరేషన్‌ సిందూర్‌ (Operation Sindoor) వేళ ఆమె చూపిన ధైర్య సాహసాలు అసమానం. ఆ సమయంలో అంతర్జాతీయ


సరిహద్దుల్లో ఒక బోర్డర్‌ అవుట్‌పోస్ట్‌ను కమాండ్‌ చేసిన ఏకైక మహిళా బీఎస్‌ఎఫ్‌ (BSF) అధికారి ఆమే కావడం విశేషం. ఎవరీ నేహా భండారి..? ఉత్తరాఖండ్‌కు చెందిన నేహా భండారి 2022లో సరిహద్దు భద్రతా దళం


(బీఎస్‌ఎఫ్‌)లో చేరారు. ఈమెది సైనిక కుటుంబ నేపథ్యం. తాత ఆర్మీలో పనిచేయగా.. తండ్రి సీఆర్పీఎఫ్‌లో పనిచేసి రిటైర్‌ అయ్యారు. తల్లి కూడా ప్రస్తుతం సీఆర్పీఎఫ్‌ విభాగంలోనే విధులు


నిర్వర్తిస్తున్నారు. వీరి కుటుంబం నుంచి సైన్యంలో చేరిన మూడో తరం వ్యక్తి ఈమె. ప్రస్తుతం జమ్మూలోని అఖ్నూర్‌ సెక్టార్‌లో అంతర్జాతీయ సరిహద్దు వెంబడి పోస్ట్‌లో అసిస్టెంట్‌ కమాండెంట్‌గా విధులు


నిర్వర్తిస్తున్నారు. 150 మీటర్ల దూరంలో శత్రువు ఉన్నా.. నేహా విధులు నిర్వర్తిస్తున్న పోస్ట్‌కు కేవలం 150 మీటర్ల దూరంలోనే పాకిస్థానీ పోస్టు ఉంది. ఏప్రిల్‌ 22న పహల్గాం ఉగ్రదాడి తర్వాత నుంచే ఈ


సరిహద్దుల్లో అలజడి వాతావరణం కొనసాగిన సంగతి తెలిసిందే. ఇక, ‘ఆపరేషన్‌ సిందూర్‌’ సమయంలో పాక్‌ రేంజర్లు మన భద్రతా బలగాలను లక్ష్య్ంగా చేసుకుని కాల్పులకు పాల్పడ్డారు. వాటిని నేహా నేతృత్వంలోని


బృందం సమర్థంగా ఎదుర్కొంది. మరో ఆరుగురు మహిళా కానిస్టేబుళ్లతో కలిసి శత్రు దాడిని ఆమె తిప్పికొట్టారు. ‘‘అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో విధులు నిర్వర్తించినప్పటికీ.. చాలా గర్వంగా ఉంది. నా


ఆధ్వర్యంలో మూడు పోస్టులు ఉన్నాయి. అక్కడి సిబ్బందితో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ పాక్ దాడులను ఎదుర్కొన్నాం. శత్రు సైన్యం లొకేషన్లను టార్గెట్‌ చేసి అందుబాటులో ఉన్న ప్రతి ఆయుధంతో ప్రతిదాడి


చేశాం. మా సిబ్బందిలో ప్రతి ఒక్కరూ ఏ మాత్రం వెరవకుండా నిలిచారు. ఎందుకంటే మేం పనిచేస్తున్నది దేశ ప్రజల రక్షణ కోసం’’ అని ఆమె పీటీఐతో మాట్లాడుతూ గర్వంగా తెలిపారు. ‘‘పురుష సిబ్బందితో పోలిస్తే


మహిళలు ఏమాత్రం తక్కువ కాదని నిరూపించాం. నాతో పాటు 18-19 మహిళా బోర్డర్‌ గార్డులు ఉన్నారు. ఇందులో ఆరుగురు గన్‌ పొజిషన్లలో ఉంటూ శత్రు దాడిని నేరుగా ఎదుర్కొన్నారు. పాక్‌ వైపు నుంచి వస్తున్న


డ్రోన్లు, మోర్టార్‌ షెల్స్‌ను మేమంతా సమర్థంగా కూల్చేశాం’’ అని నేహా వెల్లడించారు. వీరి బృందంపై బీఎస్‌ఎఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ శశాంక్ ఆనంద్‌ హర్షం వ్యక్తం చేశారు. ‘‘ఆపరేషన్‌ సిందూర్ సమయంలో


బీఎస్‌ఎఫ్‌లోని మహిళా సిబ్బంది అద్వితీయ పాత్ర పోషించారు. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో బెటాలియన్‌ హెడ్‌క్వార్టర్స్‌కు వెళ్లేందుకు వారికి అవకాశం ఉన్నప్పటికీ.. ఫార్వర్డ్‌ పోస్ట్‌లోనే ఉన్నారు.


పురుష సిబ్బందితో సమానంగా విధులు నిర్వర్తించి శత్రువులకు గట్టిగా బుద్ధి చెప్పారు. ‘ఆపరేషన్‌ సిందూర్‌’కు అసలైన నిదర్శనంగా నిలిచారు’’ అని ఆయన ప్రశంసించారు.