Play all audios:
Turkey || ఇంటర్నెట్డెస్క్: తుర్కియేకు చెందిన సెలెబీకి భారత్ కొట్టిన దెబ్బ కాస్త గట్టిగానే తాకినట్లుంది. మే 16న ఇస్తాంబుల్లో ఆ కంపెనీ షేరు ధర ఏకంగా 10శాతం పతనమైంది. గత నాలుగు సెషన్లలో ఈ
షేరు విలువ 30శాతం ఆవిరైంది. సెలెబీ సబ్సిడరీ కంపెనీ ద్వారా భారతీయ విమానాశ్రయాలలో సరకుల రవాణాతోపాటు బహుళ సేవలను ఇన్నాళ్లూ అందించింది. కానీ, ఆపరేషన్ సిందూర్ సమయంలో తుర్కియే ప్రభుత్వం
పాకిస్థాన్కు మద్దతు ఇవ్వడంతో పాటు తమ సైనికులను అక్కడకు పంపింది. దీంతో ఆగ్రహించిన భారత ప్రభుత్వం సెలెబీకి ఉన్న సెక్యూరిటీ క్లియరెన్స్లను రద్దు చేసింది. మరోవైపు అదానీ ఎయిర్ పోర్టు సంస్థ
కూడా సెలెబీతో ఉన్న ఒప్పందాన్ని రద్దు చేసుకొంది. దీంతో ముంబయి, అహ్మదాబాద్ ఎయిర్పోర్టుల నుంచి అది బయటకు వెళ్లినట్లైంది. ఈ విషయాన్ని రెండు ఎయిర్ పోర్టులకు చెందిన ప్రతినిధి ఓ ప్రకటనలో
పేర్కొన్నారు. ప్రస్తుతం అదానీ ఎయిర్ పోర్ట్స్ హోల్డింగ్కు ముంబయి, అహ్మదాబాద్, మంగళూరు, గువహాటి, జైపుర్, లఖ్నవూ, తిరువనంతపురం విమానాశ్రయాలను నిర్వహిస్తోంది. ప్రభుత్వ నిర్ణయం తర్వాత
దిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు లిమిటెడ్ కూడా తన ఒప్పందాన్ని రద్దు చేసుకొంది. ఆ స్థానంలో ఏఐఎస్ఏటీఎస్, బర్డ్గ్రూప్తో కలిసి పనిచేయనున్నట్లు తెలిపింది. ఇక తమది తుర్కియే కంపెనీయే కాదని
తాజాగా సెలెబీ వివరణ ఇచ్చింది. ఆ దేశాధ్యక్షుడు ఎర్డోగాన్ కుటుంబంతో తమకు సంబంధం లేదని, ఆయన కుమార్తె తమకు బాస్ కాదని వివరణ ఇచ్చింది. ‘‘తుర్కియే అధ్యక్షుడు ఎర్డోగాన్ కుమార్తె సుమెయ్యి మా
కంపెనీని నియంత్రిస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదు. మా మాతృసంస్థలో ఆ పేరుతో ఎవరికీ హక్కులు గానీ, వాటాలు గానీ లేవు. అసలు మాది తుర్కియే సంస్థే కాదు. మా కంపెనీ యాజమాన్య హక్కులన్నీ
సెలెబీయోగ్లు కుటుంబానికే పరిమితం. వారికి ఎలాంటి రాజకీయ సంబంధాలు లేవు ’’ అని కంపెనీ తమ ప్రకటనలో వెల్లడించింది.