Play all audios:
India-US | ఇంటర్నెట్ డెస్క్: భారత్, అమెరికాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (BTA) మొదటి దశను త్వరితగతిన పూర్తి చేసేందుకు ఇరుదేశాలు చర్చలను ముమ్మరం చేశాయి. ఈ మేరకు కేంద్ర వాణిజ్య,
పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అమెరికా వాణిజ్య మంత్రి హోవార్డ్ లుట్నిక్తో సమావేశమయ్యారు. మొదటి దశ ఒప్పందాన్ని త్వరగా పూర్తి చేసే దిశగా తమ మధ్య ఫలప్రదమైన చర్చలు జరిగాయని ఎక్స్ వేదికగా
తెలిపారు. మంత్రుల స్థాయి సమావేశాల అనంతరం రెండు దేశాల ప్రధాన సంధానకర్తల మధ్య చర్చలు ఈనెల 22 వరకు నిర్వహించనున్నారు. ఈ ఏడాది సెప్టెంబరు-అక్టోబరు నాటికి తొలి దశ ఒప్పందాన్ని ఖరారు చేయాలనే
లక్ష్యంతో ఉన్నారు. ఈ చర్చల్లో ప్రధానంగా పరస్పర మార్కెట్ల వినియోగం.. స్థానిక నిబంధనల అమలు, టారిఫ్ మినహాయింపులకు పరిమితులపై ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. * ఫండ్లలోనూ ‘రాణి’స్తున్నారు ఈ
ఒప్పందంలో భారత్ కొన్ని కీలక రంగాల్లో సుంకాల నుంచి సడలింపు కోరుతోంది. ఇందులో టెక్స్టైల్స్, రత్నాలు, ఆభరణాలు, దుస్తులు, ప్లాస్టిక్స్, రసాయనాలు, రొయ్యలు, నూనె గింజలు, రసాయనాలు, ద్రాక్ష,
అరటిపండ్లు వంటివి ఉన్నాయి. మరోవైపు అమెరికా కొన్ని పారిశ్రామిక వస్తువులు, ఆటోమొబైల్స్ (ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాలు), వైన్స్, పెట్రోకెమికల్ ఉత్పత్తులు, పాడి ఉత్పత్తులు రంగాల్లో సుంకాల
సడలింపు కోరుతోంది. ఈ ఒప్పందం కోసం రెండు దేశాలు నిబంధనల్ని ఖరారు చేశాయి. ఇందులో సుంకాలు, వస్తువులు, సేవలు, సుంకేతర అడ్డంకులు, కస్టమ్స్ వంటి అంశాలు ఉన్నాయి. అమెరికా.. భారత్పై విధించిన అదనపు
26 శాతం సుంకాలను జులై 9 వరకు తాత్కాలికంగా నిలిపివేసిన నేపథ్యంలో ఈ 90 రోజల వ్యవధిని ఉపయోగించుకొని చర్చలను ముందుకు తీసుకెళ్లాలని ఇరు దేశాలు భావిస్తున్నాయి. ఇక 10 శాతం బేస్లైన్ సుంకం
యథాతథంగా కొనసాగుతుంది. విస్తృతమైన వాణిజ్య లోటును తగ్గించేందుకు టారిఫ్ చర్యలు తీసుకున్నట్లు అమెరికా ఏప్రిల్ 2న ప్రకటించిన విషయం తెలిసిందే.