Play all audios:
robot: తనకు తానుగా పంట తెగుళ్లను గుర్తించి.. పురుగు మందులను పిచికారీ చేయగల రోబోను ఐఐటీ ఖరగ్పుర్ అభివృద్ధి చేసింది. ఇంటర్నెట్డెస్క్: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అనేక రంగాలను ప్రభావితం
చేస్తోంది. వ్యవసాయంలోనూ దాని పాత్ర కీలకం(smart farming). ప్రస్తుతం సాగులో రోబో (robot)ల విప్లవం మొదలైంది. ఈ దిశగా ఐఐటీ ఖరగ్పుర్ వినూత్న ఆవిష్కరణ చేసింది. తనకు తానుగా పంట తెగుళ్లను
గుర్తించి.. పురుగు మందులను పిచికారీ చేయగల రోబోను ఆ ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలోని మెకానికల్ ఇంజినీరింగ్ విభాగం అభివృద్ధి చేసింది. ‘‘రైతులు ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడంతో పాటు
వ్యవసాయంలో ఉత్పాదకతను పెంచడం లక్ష్యంగా దీనిని రూపొందించాం’’ అని ప్రొఫెసర్ దిలీప్ కుమార్ ప్రతిహార్ వెల్లడించారు. ఆయన పర్యవేక్షణలో అగ్రికల్చర్ రోబోటిక్ సిస్టమ్ను పీహెచ్డీ, ప్రాజెక్ట్
స్టూడెంట్స్ బృందం రూపొందించింది. 2018లోనే దిలీప్ కుమార్కు ఈ ఆలోచన వచ్చింది. వివిధ రకాల భౌగోళిక స్వరూపాలు కలిగిన వ్యవసాయ భూములకు సరిపడేలా ట్రాక్డ్ మొబైల్ మానిప్యులేటర్ ఆలోచనను ప్రొఫెసర్
ప్రతిపాదించారు. అదే మనిషి చేతి మాదిరిగా ఉండే సీరియల్ మానిప్యులేటర్ (రోబోటిక్ ఆర్మ్) వ్యవస్థను రూపకల్పనకు దారితీసింది. ఇప్పటికే డ్రోన్ ఆధారిత వ్యవసాయ పరికరాలకు ఆదరణ లభిస్తోంది. అయితే వాటికి
కొన్ని పరిమితులు ఉన్నాయి. అవి మొక్కల ఆకుల పూర్తి ఇమేజ్ను సంగ్రహించలేకపోతున్నాయి. అదే ట్రాక్డ్ మొబైల్ మ్యానిప్యులేటర్ మాత్రం ఆ పరిమితి ఉండదు. అది మొక్కల వ్యాధులను కచ్చితంగా గుర్తించి,
తర్వాత తగిన పురుగుమందును ఎంచుకొని, ఆటోమెటిక్గా పిచికారీ చేస్తుంది. ఈ ప్రాజెక్టుకు ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ సహకారం లభించింది. ఈ రోబో వల్ల రైతులు ప్రమాదకర రసాయనాల ప్రభావానికి గురయ్యే
పరిస్థితి తగ్గుముఖం పడుతుంది. అలాగే పంటను తెగుళ్ల నుంచి కాపాడుకునే వీలు కలిగి, ఉత్పాదకత పెరగడానికి దోహదం చేస్తుందని ఆవిష్కర్తలు వెల్లడించారు.