Play all audios:
ఇంటర్నెట్ డెస్క్: పాకిస్థాన్కు గూఢచారిగా వ్యవహరించిందన్న ఆరోపణలపై హరియాణాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాను (Jyoti Malhotra) పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. విచారణ క్రమంలో
అధికారులు కీలక విషయాలు రాబడుతున్నారు. మల్హోత్రాను ఓ అస్త్రంగా పాకిస్థాన్ ఐఎస్ఐ ఏజెంట్లు (ISI) మలచుకున్నట్లు హరియాణా పోలీసులు గుర్తించారు. ఇటీవల ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor)
సమయంలో దిల్లీలోని పాక్ రాయబార కార్యాలయంలోని ఓ అధికారితో ఆమె టచ్లో ఉన్నట్లు నిర్ధరించారు. ఇన్ఫ్లుయెన్సర్లను అస్త్రంగా మలచుకొని.. ‘‘జ్యోతి మల్హోత్రా సైనిక లేదా రక్షణ కార్యకలాపాలకు
సంబంధించిన సమాచారం వారితో పంచుకుందని ఈ దశలో చెప్పలేం. కానీ, పాక్ నిఘా వర్గాలతో (PIO) ఆమె నేరుగా సంప్రదింపులు జరిపారు. వాళ్లు మల్హోత్రాను ఓ అస్త్రంగా చేసుకున్నారని కచ్చితంగా చెప్పగలం. ఇతర
యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లతోనూ ఆమె టచ్లో ఉన్నారు. వాళ్లు కూడా పీఐవోలతో సంప్రదింపులు జరుపుతున్నారు’’ అని హిసార్ ఎస్పీ శశాంక్ కుమార్ సావర్ తెలిపారు. ఇది కూడా ఓ రకమైన యుద్ధమేనని,
ఇన్ఫ్లుయెన్సర్లను నియమించుకుంటూ.. వారి ప్రయత్నాలను అమలు చేస్తారన్నారు. * పాక్కు గూఢచర్యం చేస్తోన్న యూట్యూబర్ అరెస్ట్.. ఎవరా జ్యోతి మల్హోత్రా..? పాకిస్థాన్కు పలుసార్లు.. జ్యోతి మల్హోత్రా
పాకిస్థాన్లో పలుమార్లు పర్యటించిందని, ఓసారి చైనాకూ వెళ్లి వచ్చినట్లు హరియాణా పోలీసులు వెల్లడించారు. ఇటీవల బహిష్కరణకు గురైన పాక్ అధికారితోనూ ఆమె టచ్లో ఉన్నట్లు గుర్తించామన్నారు. ఆర్థిక
లావాదేవీలు, ప్రయాణ వివరాలు విశ్లేషిస్తున్నామని, ఎక్కడికి వెళ్లింది.. ఎవరిని కలిసింది? అనే విషయాలను కనుగొనే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఆమె ల్యాప్టాప్ సహా ఎలక్ట్రానిక్ పరికరాలపై
ఫోరెన్సిక్ విశ్లేషణ చేస్తామని, ఏం సమాచారం పంచుకుందనే విషయం అప్పుడు స్పష్టమవుతుందన్నారు. ఈ కేసుకు సంబంధించి కేంద్ర దర్యాప్తు సంస్థలతోనూ తాము సంప్రదింపులు కొనసాగిస్తున్నామని చెప్పారు.