Play all audios:
ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్ను ఉద్దేశిస్తూ భారత దౌత్యవేత్త అనుపమ సింగ్ డబ్ల్యూహెచ్వోలో బలమైన ప్రసంగం చేశారు. ఇంటర్నెట్డెస్క్: ఓవైపు ఉగ్ర విత్తనాలు నాటుతూనే.. మరోవైపు తామే
బాధితులం అని నటించొద్దని పాకిస్థాన్కు భారత (India) దౌత్యవేత్త అనుపమ సింగ్ (Anupama Singh) హితవు పలికారు. జెనీవాలోని డబ్ల్యూహెచ్వో ప్రధాన కార్యాలయంలో జరిగిన ఓ సమావేశంలో ఆమె ఈ వ్యాఖ్యలు
చేశారు. ప్రస్తుతం ఆమె ప్రసంగానికి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. ‘పాకిస్థాన్ (Pakistan) నేల మీద నుంచే ఉగ్రవాదులు, దాని నిర్వాహకులు పుట్టుకొస్తున్నారనే విషయం మరచిపోకూడదు.
వారికి బుద్ధి చెప్పేందుకే భారత్ ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor)ను ప్రారంభించింది. దాయాది దేశంలోని ఉగ్రస్థావరాలను, వారి మౌలిక సదుపాయాలను నేలకూల్చింది. ఆ దేశ పౌరులు లక్ష్యంగా కానీ,
వారికి హాని కలిగించేలా కానీ భారత్ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. సింధూ జలాల ఒప్పందం రద్దుపై కూడా పాక్ తప్పుడు కథనాలను ప్రచారం చేసింది. దాన్ని మేం సమర్థమంతంగా తిప్పికొట్టాం. ఉగ్రవాదాన్ని
ప్రోత్సహిస్తూ తామే బాధితులమంటూ మొసలి కన్నీళ్లు కార్చకూడదు’ అని అనుపమ సింగ్ పేర్కొన్నారు. * పాక్ను మోకాళ్ల మీద కూర్చోబెట్టాం: ప్రధాని మోదీ పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిలో 26 మంది
ప్రాణాలు కోల్పోయారు. దీనికి ప్రతిస్పందనగా భారత్ ఆపరేషన్ సిందూర్ను నిర్వహించింది. ఈ ఆపరేషన్లో భాగంగా పాక్, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రస్థావరాలను మన బలగాలు నేలమట్టం చేశాయి. దీన్ని
సహించలేని పాక్ సైన్యం మనపై ఎదురుదాడికి ప్రయత్నించింది. వీటిని మన బలగాలు తిప్పికొట్టి పాక్ను చావుదెబ్బ తీశాయి. ప్రస్తుతం ఇరుదేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతోంది.