Play all audios:
ఇంటర్నెట్ డెస్క్: ఐఫోన్ల తయారీకి సంబంధించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ‘యాపిల్’ సంస్థను మరోసారి హెచ్చరించారు. అమెరికాలో విక్రయించే ఐఫోన్లను (iphone) స్థానికంగానే
తయారు చేయాలన్నారు. భారత్ లేదా మరే దేశంలో తయారు చేయొద్దని.. అలా చేస్తే కనీసం 25శాతం సుంకం ఎదుర్కోవాల్సిందేనని స్పష్టం చేశారు. ‘‘అమెరికాలో విక్రయించే ఐఫోన్లను యునైటెడ్ స్టేట్స్లోనే తయారు
చేయాలి. భారత్ లేదా మరో దేశంలో కాదని టిమ్ కుక్కు ఇదివరకే తెలియజేశా. అలా కుదరదంటే.. కనీసం 25శాతం సుంకాన్ని అమెరికాకు యాపిల్ చెల్లించాల్సిందే’’ అని అధ్యక్షుడు ట్రంప్ సొంత సామాజిక వేదిక
ట్రూత్ సోషల్లో పోస్టు చేశారు. ఆ వెంటనే యాపిల్ షేరు విలువ మూడు శాతం పతనమైనట్లు తెలుస్తోంది. * భారత ‘యాపిల్’ ఇక అమెరికాకే..! చైనాపై అమెరికా సుంకాల ప్రభావం నేపథ్యంలో ఐఫోన్ల తయారీని భారత్లో
చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు యాపిల్ ఇదివరకే వెల్లడించింది. ఈ విస్తరణ ప్రక్రియపై ఇటీవల స్పందించిన ట్రంప్.. దాన్ని నిలిపివేయాలని యాపిల్కు సూచించారు. భారత్లో యాపిల్ భారీగా తయారీ
కార్యక్రమాలు చేపడుతోందని.. అది తనకు ఇష్టం లేదనే విషయాన్ని ఖతార్ పర్యటన సందర్భంగా ట్రంప్ వెల్లడించారు. తాజాగా ఇదే విషయంపై మళ్లీ స్పందించిన ఆయన.. అమెరికాలో తయారు చేయకుంటే సుంకాలు చెల్లించక
తప్పదంటూ యాపిల్ను హెచ్చరించడం గమనార్హం. ఈయూ దేశాలపై 50శాతం సుంకం ఈయూ దేశాలపై ట్రంప్ సుంకాల కొరడా ఝళిపించారు. ఆయా దేశాలపై 50 శాతం సుంకం విధిస్తామని, జూన్ 1 నుంచి కొత్త టారిఫ్ అమల్లోకి
వస్తుందని తెలిపారు. ఈయూతో జరిపిన చర్చలు ఫలవంతం కాలేదని, చర్చలు నిలిచిపోయిన నేపథ్యంలో ఈ సుంకాలు విధిస్తున్నట్లు పేర్కొన్నారు.