Play all audios:
భారత్- పాకిస్థాన్ ఉద్రిక్తతల సమయంలో వరుస వ్యాఖ్యలతో శశిథరూర్ లక్ష్మణ రేఖ దాటారని కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి. ఇంటర్నెట్ డెస్క్: కాంగ్రెస్ (Congress) అధినాయకత్వంతో పార్టీ సీనియర్
నేత శశిథరూర్ (Shashi Tharoor) బంధం బీటలు వారుతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సొంత పార్టీలోనే ఆయన వ్యవహార శైలిపై అసంతృప్తి వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల
భారత్- పాకిస్థాన్ ఉద్రిక్తతల సమయంలో వరుస వ్యాఖ్యలతో శశిథరూర్ లక్ష్మణ రేఖ దాటారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. కాంగ్రెస్ సీనియర్ నేతలు రాహుల్ గాంధీ, జైరాం రమేశ్, కేసీ వేణుగోపాల్,
శశిథరూర్, ప్రియాంక గాంధీ, సచిన్ పైలట్ తదితరులు బుధవారం దిల్లీలో సమావేశమయ్యారు. ఈ భేటీ అనంతరం పార్టీ వర్గాలు శశిథరూర్ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాయి. ‘‘కాంగ్రెస్ ఓ ప్రజాస్వామ్య
పార్టీ. నేతలు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తపరుస్తారు. కానీ, శశిథరూర్ ఈసారి లక్ష్మణ రేఖ దాటారు. ఈ క్రమంలోనే వ్యక్తిగత అభిప్రాయాల వెల్లడికి ఇది సమయం కాదని, పార్టీ వైఖరికి కట్టుబడి ఉండాలని
తాజా సమావేశంలో అధిష్ఠానం సైతం ఎవరి పేరు ఎత్తకుండానే స్పష్టం చేసింది’’ అని తెలిపాయి. ఈ వ్యవహారంపై జైరాం రమేశ్ సైతం స్పందిస్తూ.. శశిథరూర్ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగత అభిప్రాయాలని, పార్టీతో
ఎటువంటి సంబంధం లేదన్నారు. * సింధూ జలాలపై పునఃసమీక్షించండి.. భారత్కు పాకిస్థాన్ విజ్ఞప్తి భారత్- పాక్ ఉద్రిక్తతల సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ సమర్థంగా వ్యవహరించారంటూ శశిథరూర్ ఇటీవల
ప్రశంసించారు. ఉగ్రవాదం విషయంలో దాయాది దేశానికి స్పష్టమైన సందేశాన్ని ఇచ్చారన్నారు. అంతకుముందు తిరువనంతపురంలో ప్రధాని మోదీ కార్యక్రమానికి శశిథరూర్ హాజరైన విషయం తెలిసిందే. తాము ఇద్దరం ఒకే
వేదికపై ఉండటం కొంతమందికి నిద్ర లేని రాత్రిని మిగులుస్తుందని మోదీ అప్పట్లో వ్యంగ్యాస్త్రాలు విసిరారు.