Play all audios:
కేరళ సముద్ర తీరానికి సమీపంలో ప్రమాదానికి గురైన లైబీరియాకు చెందిన భారీ నౌక పూర్తిగా సముద్రంలో మునిగిపోయినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇంటర్నెట్ డెస్క్: లైబీరియాకు చెందిన ఓ భారీ నౌక కేరళ
సముద్ర తీరానికి 38 నాటికల్ మైళ్ల దూరంలో శనివారం ప్రమాదానికి గురైంది. తాజాగా అది పూర్తిగా సముద్రంలో మునిగిపోయినట్లు ఇండియన్ కోస్ట్ గార్డ్ (ICG) ప్రకటించింది. ఈ నౌకలో 640 కంటైనర్లు ఉండగా..
వాటిలో 13 కంటైనర్లలో ప్రమాదకరమైన రసాయనాలు, 12 కంటైనర్లలో కాల్షియం కార్బైడ్, మిగిలిన వాటిలో 84.44 మెట్రిక్ టన్నుల డీజిల్, 367.1 మెట్రిక్ టన్నుల ఫర్నేస్ ఆయిల్ ఉన్నట్లు తెలిపింది. ఇవి లీకైతే
సముద్ర జలాలు తీవ్రంగా కలుషితమయ్యే ప్రమాదం ఉండడంతో అధికారులు కొచ్చి తీరంలో హై అలర్ట్ ప్రకటించారు. కంటైనర్లను, అందులోంచి బయటకు వచ్చిన ఇంధనం తీరంవైపునకు వస్తే తాకొద్దని ప్రజలను కేరళ విపత్తు
నిర్వహణ సంస్థ హెచ్చరించింది. సముద్ర జలాల్లో ఇంధనం లీకై ఎంత మేరకు వ్యాపించిందనే విషయాన్ని తెలుసుకోవడానికి ‘ఆయిల్ స్పిల్ మ్యాపింగ్ టెక్నాలజీ’ వినియోగించే విమానం సముద్రంపై చక్కర్లు కొడుతోందని
అధికారులు తెలిపారు. ఈ ఘటన కారణంగా తలెత్తే పర్యావరణ సమస్యలను ఎదుర్కోవడానికి ముందస్తుగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. * ప్రమాదంలో లైబీరియా నౌక లైబీరియాకు చెందిన ఓ భారీ నౌక శనివరం కేరళ సముద్ర
తీరానికి 38 నాటికల్ మైళ్ల దూరంలో తొలుత ఓ వైపునకు ఒరిగిపోయింది. దీంతో అందులోని కొన్ని కంటైనర్లు సముద్రంలో పడిపోయాయి. విఝింజమ్ పోర్టు నుంచి శుక్రవారం బయల్దేరిన 184 మీటర్ల పొడవున్న ఎంఎస్సీ
ఎల్సా-3 నౌక శనివారం మధ్యాహ్నానికి కొచ్చిన్ చేరుకోవాల్సి ఉండగా.. కంటైనర్ నౌక సముద్రంలో మునగడాన్ని గమనించిన ఇండియన్ కోస్ట్ గార్డ్ (ICG) వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టింది. అందులో
ఉన్న మొత్తం 24మంది సిబ్బందిని సురక్షితంగా తీరానికి చేర్చినట్లు అధికారులు పేర్కొన్నారు.