Play all audios:
ఫ్రాంక్ఫర్ట్: విశ్వవిఖ్యాత నటసార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు 102వ జయంతిని పురస్కరించుకొని జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్లో ఈ నెల 24, 25 తేదీల్లో మినీ మహానాడు నిర్వహించనున్నారు. ఈ మేరకు
జర్మనీ ఎన్నారై తెదేపా నేతలు ఏర్పాట్లపై సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మహానాడు పోస్టర్ను ఆవిష్కరించారు. ఎన్నారై తెదేపా జర్మనీ విభాగం అధ్యక్షుడు పవన్ కుర్రా మాట్లాడుతూ.. మహానాడుకు
మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యే గౌతు శిరీష, గుంటూరు మిర్చియార్డ్ మాజీ ఛైర్మన్ మన్నవ సుబ్బారావులు ముఖ్య అతిథులుగా హాజరవుతారని తెలిపారు. ‘‘తెదేపా ఆవిర్భావం తర్వాత చరిత్రలో ఎన్నడూ లేని విధంగా
ప్రజలు 2024 సార్వత్రిక ఎన్నికల్లో తిరుగులేని విజయం అందించి తెలుగువారి ఖ్యాతిని దశదిశలా చాటారు. అందుకే ఈసారి మినీ మహానాడు, ఎన్టీఆర్ 102 జయంతి వేడుకలను పండుగ వాతావరణంలో ఘనంగా నిర్వహించాలని
నిర్ణయించాం’’ అని ప్రధాన కార్యదర్శి సుమంత్ కొర్రపాటి తెలిపారు. మినీ మహానాడు సమన్వయకర్తలు శ్రీకాంత్ కుడితిపూడి, శివ మాట్లాడుతూ.. యూరప్లోని అన్ని దేశాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ అభిమానులు,
కార్యకర్తలు హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. మహానాడు సందర్భంగా తొలుత జ్యోతి ప్రజ్వలనం, అనంతరం ఎన్టీఆర్కు ఘన నివాళితో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలు
నిర్వహించనున్నారు. పహల్గాం ఉగ్రదాడిలో మృతులకు సంతాపం, చనిపోయిన తెదేపా కార్యకర్తలకు నివాళి, తెదేపా చరిత్రాత్మక విజయంలో భాగస్వాములైన వారికి కృతజ్ఞతలు, ఎన్నారైలకు ప్రత్యేక సెల్, అన్న
ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలి, పద్మభూషణ్ అందుకున్న బాలకృష్ణకు అభినందనలపై పలు తీర్మానాలు చేయనున్నారు. తెలుగు వంటకాలను అతిథులకు ప్రత్యేకంగా వడ్డించనున్నారు. ఈ కార్యక్రమంలో నరేంద్ర నాదెండ్ల,
రాజశేఖర్ పార్నపల్లి, అశోక్ గాండ్ల, దినేష్ కోవి, వంశీ ఉండవల్లి, వంశీ మన్నం, నరేంద్ర మనుపాటి, అనుదీప్ మేదరమెట్ల తదితరులు పాల్గొన్నారు.