Play all audios:
ఇంటర్నెట్ డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2025) నాకౌట్ స్టేజ్కు చేరుకుంది. తొలి క్వాలిఫయర్, ఎలిమినేటర్ మ్యాచ్లు ముగిశాయి. ఇక రెండో క్వాలిఫయర్, ఫైనల్ మాత్రమే బాకీ. అత్యధిక పరుగులు
చేసే బ్యాటర్లకు ఇచ్చే ‘ఆరెంజ్ క్యాప్’, ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్కు ఇచ్చే ‘పర్పుల్ క్యాప్’ను ఎవరు సొంతం చేసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. మరి ఈ రేసులో ఎవరు ఉన్నారు? ఎవరికి అవకాశం ఉందో ఓ
లుక్కేద్దాం. గుజరాత్ టైటాన్స్ ఎలిమినేటర్ మ్యాచ్లో ఓడి ఇంటిముఖం పట్టింది. ముంబయి విజేతగా నిలిచి రెండో క్వాలిఫయర్కు దూసుకెళ్లింది. గుజరాత్ ఆటగాడు సాయి సుదర్శన్ (80) కీలక ఇన్నింగ్స్ ఆడినా
జట్టును గెలిపించుకోలేకపోయాడు. అయితే, అతడు ఆరెంజ్ క్యాప్ రేసులో మాత్రం దూసుకుపోయాడు. ప్రస్తుతం 759 పరుగులు చేసిన సాయి టాప్ స్కోరర్గా కొనసాగుతున్నాడు. ఇక పర్పుల్ క్యాప్ను దక్కించుకొనేందుకు
గుజరాత్ టైటాన్స్ బౌలరే రేసులో ఉండటం విశేషం. ప్రసిద్ధ్ కృష్ణ 25 వికెట్లతో టాప్ ప్లేస్లో ఉన్నాడు. విరాట్కు కష్టమే.. సూర్యకే ఛాన్స్ అత్యధిక పరుగుల జాబితాలో సాయి సుదర్శన్ టాప్లో ఉండగా...
ఆ తర్వాత ముంబయి ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ (673), శుభ్మన్ గిల్ (650), మిచెల్ మార్ష్ (627), విరాట్ కోహ్లీ (614) టాప్ -5లో ఉన్నారు. ఇందులో జీటీ కెప్టెన్ గిల్, లఖ్నవూ ఆటగాడు మిచెల్ మార్ష్
రేసు నుంచి వైదొలగారు. సాయికి సూర్యకు మధ్య 86 పరుగుల వ్యత్యాసం మాత్రమే ఉంది. ముంబయి జట్టు రెండో క్వాలిఫయర్కు దూసుకెళ్లింది. ఇక్కడా గెలిస్తే ఫైనల్ ఆడే అవకాశం ఉంది. అంటే రెండు మ్యాచుల్లో
బ్యాటింగ్ చేసే అవకాశం సూర్యకు ఉంటుంది. అప్పుడు సాయి సుదర్శన్ చేసిన 759 పరుగులను అధిగమించేందుకు ఛాన్స్ లేకపోలేదు. ఇప్పటికే ఆర్సీబీ ఫైనల్కు దూసుకెళ్లిన సంగతి తెలిసిందే. ఆ జట్టు స్టార్
ప్లేయర్ విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్గా మారాలంటే మాత్రం భారీ శతకం చేయాల్సిందే. ఎందుకంటే సాయి కంటే విరాట్ 145 పరుగులు వెనుకబడి ఉన్నాడు. సూర్య, విరాట్ సాధించలేకపోతే మాత్రం సాయి సుదర్శన్దే
‘ఆరెంజ్ క్యాప్’. పర్పుల్ క్యాప్.. నలుగురు పోటీ గుజరాత్ ఆటగాడు ప్రసిద్ధ్ కృష్ణ 15 మ్యాచుల్లో 25 వికెట్లు తీశాడు. గుజరాత్ ఎలిమినేట్ అయిపోయింది. ప్రసిద్ధ్ తర్వాత నూర్ అహ్మద్ (24) ఉన్నాడు.
అతడు చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్. ఈ జట్టు లీగ్ స్టేజ్కే పరిమితమైన సంగతి తెలిసిందే. వీరి తర్వాత జోష్ హేజిల్ వుడ్ (21), ట్రెంట్ బౌల్ట్ (21), సాయి కిశోర్ (19), జస్ప్రీత్ బుమ్రా (18),
అర్ష్దీప్ (18) ఉన్నారు. సాయి కిశోర్ గుజరాత్ బౌలర్ కావడంతో అతడికి అవకాశాలు లేవు. ఆర్సీబీ ఫైనల్ ఆడాల్సి ఉంది. జోష్ హేజిల్వుడ్ మరో నాలుగు వికెట్లు తీస్తే ముందుకు దూసుకెళ్తాడు. పంజాబ్తో
రెండో క్వాలిఫయర్ ఆడనున్న ముంబయి అందులో గెలిస్తే మాత్రం మరొక మ్యాచ్ ఆడే అవకాశం ఉంటుంది. అంటే ట్రెంట్ బౌల్ట్, బుమ్రా, అర్ష్దీప్ సింగ్కు కాస్త ఎక్కువ ఛాన్స్ ఉన్నట్లే.