Play all audios:
జాతీయ భద్రతకు విఘాతం కలిగించేలా ఉన్నాయంటూ అభియోగాలు మోపిన సౌదీ ప్రభుత్వం.. ఓ వ్యక్తికి పదేళ్ల జైలు శిక్ష విధించింది. ఇంటర్నెట్ డెస్క్: సోషల్ మీడియాలో చురుకుగా ఉండే బ్రిటిష్ పౌరుడు చేసిన
ఓ కామెంటు ఆయన జీవితాన్ని తలకిందులు చేసింది. అతడి వ్యాఖ్యలు జాతీయ భద్రతకు విఘాతం కలిగించేలా ఉన్నాయంటూ అభియోగాలు మోపిన సౌదీ ప్రభుత్వం.. తీవ్ర చర్యలు తీసుకుంది. ఏడేళ్ల నాటి ట్వీట్కు సంబంధించి
అతడికి పదేళ్ల జైలుశిక్ష విధించింది. బాధితుడి కుటుంబ సభ్యులు మాత్రం అతడు ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని, విడుదల చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. బ్రిటన్కు చెందిన అహ్మద్ ల్-దౌష్.. బ్యాంక్ ఆఫ్
అమెరికాలో (Bank of America) సీనియర్ బిజినెస్ అనలిస్ట్గా చేసేవారు. భార్య, ముగ్గురు పిల్లలు. గతేడాది ఆగస్టు 31న రియాద్ నుంచి బ్రిటన్కు వెళ్తున్న అహ్మద్ను కింగ్ ఖలీద్ అంతర్జాతీయ
విమానాశ్రయంలో పోలీసులు అరెస్టు చేశారు. అతడి విజ్ఞప్తి మేరకు భార్య, పిల్లల్ని యూకే వెళ్లేందుకు అనుమతించారు. నెలపాటు ఒంటరిగా నిర్బంధించిన అధికారులు.. ఆ తర్వాత అత్యంత భద్రత కలిగిన జైలుకు
తరలించారు. కొన్నాళ్లపాటు అతడి ఆచూకీ గురించి కుటుంబ సభ్యులకూ తెలియలేదు. మూడు నెలల తర్వాత అతడిని సౌదీ అధికారులు కోర్టులో ప్రవేశపెట్టారు. సౌదీ ప్రభుత్వంపై 2018లో సోషల్ మీడియా వేదికగా చేసిన ఓ
పోస్టు.. అహ్మద్ అరెస్టుకు కారణంగా తెలిసింది. ఆయన కుటుంబ సభ్యులు మాత్రం సూడాన్ రాజకీయ పరిస్థితుల గురించి మాత్రమే అతడు అప్పుడప్పుడు స్పందించే వాడని, సౌదీపై ఎప్పుడూ ఎటువంటి వ్యాఖ్యలు
చేయలేదన్నారు. నిర్బంధంలో ఉన్న తన భర్తను విడుదల చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ బాధితురాలి భార్య నూర్ బ్రిటన్ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. దౌత్య ప్రయత్నాలు పెంచాలని కోరారు. ఈ విషయంపై
అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలు కూడా ఆందోళన వ్యక్తం చేశాయి. అటు బ్రిటన్ ప్రభుత్వం కూడా బాధితుడికి అండగా నిలుస్తున్నామని, కుటుంబ సభ్యులకు టచ్లోనే ఉన్నామని తెలిపింది.