Play all audios:
ఇంటర్నెట్ డెస్క్: పలు కారణాలతో విదేశీ విద్యార్థుల వీసాలను రద్దు చేస్తూ.. వారిని దేశం నుంచి బహిష్కరిస్తున్న అగ్రరాజ్యం అమెరికా తాజాగా మరో హెచ్చరిక చేసింది. తమ విద్యా సంస్థల్లో చదివే భారత్
సహా విదేశీ విద్యార్థుల గైర్హాజరు ఆధారంగా కూడా వీసాలను (Student Visa in US) రద్దు చేస్తామని వార్నింగ్ ఇచ్చింది. ఈ మేరకు భారత్లోని అమెరికా ఎంబసీ (US Embassy) దీనిపై మంగళవారం ఓ ప్రకటన జారీ
చేసింది. ‘‘విద్యాసంస్థ నుంచి డ్రాపౌట్ అయినా.. క్లాస్లు ఎగ్గొట్టినా.. విద్యాసంస్థకు చెప్పకుండా స్టడీ ప్రోగ్రామ్ నుంచి వెళ్లిపోయినా మీ స్టూడెంట్ వీసా రద్దవుతుంది. భవిష్యత్తులో ఎలాంటి
అమెరికా వీసాలకైనా మీరు అర్హత కోల్పోతారు. సమస్యల బారిన పడకుండా ఉండేందుకు ఈ నిబంధనలకు అనుగుణంగా నడుచుకోండి. మీ విద్యార్థి వీసాను కొనసాగించుకోండి’’ అని యూఎస్ ఎంబసీ ఆ ప్రకటనలో వెల్లడించింది.
విదేశీ విద్యార్థులపై ట్రంప్ (Donald Trump) సర్కారు కన్నెర్ర చేసిన సంగతి తెలిసిందే. పాలస్తీనా అనుకూల ఆందోళనల్లో పాల్గొన్న వారి దగ్గరుంచి.. చిన్న చిన్న ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడిన వారి
వీసాలను కూడా రద్దు చేస్తూ స్వదేశాలకు పంపించేస్తున్నారు. వీరిలో కొందరు భారతీయులు కూడా ఉన్నారు. దీనిపై ఆయా విద్యార్థులు న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు. ఆప్టికల్ ప్రాక్టికల్ ట్రైనింగ్
వీసాలపై ఉన్న విదేశీ విద్యార్థులకు కూడా ఇటీవల యూఎస్ ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ హెచ్చరికలు జారీ చేసింది. ఓపీటీ ట్రైనింగ్ను ప్రారంభించిన 90 రోజుల్లోగా ఉపాధిపై స్టేటస్
తెలియజేయాలని, లేదంటే చట్టబద్ధ హోదాను కోల్పోతారని హెచ్చరించింది. ఈ క్రమంలోనే తాజా ప్రకటన వెలువడటంతో విదేశీ విద్యార్థుల్లో గందరగోళం నెలకొంది. విదేశాల్లో 18 లక్షల మంది భారతీయ విద్యార్థులు ఇదిలా
ఉండగా విదేశాల్లో భారత విద్యార్థుల సంఖ్య 2025లో 18 లక్షలకు చేరుకుందని భారత విదేశాంగ శాఖ గణాంకాలు వెల్లడించాయి. 2023లో 13లక్షల మంది విద్యార్థులు ఉండగా.. ఈ ఏడాది ఆ సంఖ్య భారీగా పెరిగింది.
ఇప్పటివరకు అమెరికాలోనే ఎక్కువ మంది భారతీయులు చదువుతుండగా.. గత కొంతకాలంగా వీరి సంఖ్య తగ్గుతోంది. ఇప్పుడు కెనడా, యూకేలో చదువుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు విదేశాంగ శాఖ గణాంకాలు
పేర్కొన్నాయి. గతేడాది అమెరికాలో రికార్డు స్థాయిలో 3,31,602 మంది భారతీయ విద్యార్థులు ఉన్నారు. కెనడాలో 1,37,608 మంది, యూకేలో 98,890 మంది చదువుకుంటున్నారు.