Play all audios:
మాస్కో: ఇటీవల తుర్కియే వేదికగా రష్యా, ఉక్రెయిన్ (Russia-Ukraine Conflict) మధ్య ప్రత్యక్ష శాంతి చర్చలు జరిగిన సంగతి తెలిసిందే. అయితే యుద్ధం ముగింపు దిశగా గణనీయమైన స్థాయిలో ఈ చర్చలు ఫలితం
ఇవ్వలేదు. తాజాగా మరోసారి ప్రత్యక్ష చర్చల కోసం రష్యా (Russia) ప్రతిపాదనలు చేసింది. ఈ విషయాన్ని రష్యా విదేశాంగ మంత్రి సెర్గెయ్ లావ్రోవ్ పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య సుస్థిర శాంతి కోసం
ఇస్తాంబుల్లో జూన్ 2 మరోసారి నేరుగా చర్చలు జరపాలనుకుంటున్నట్లు ఆయన తెలిపారు. అయితే దీనిపై కీవ్ ఇంతవరకు స్పందించలేదు. మాస్కో, కీవ్ మధ్య శాంతి ప్రక్రియ విజయవంతం కోసం మాటల్లోనే కాకుండా
నిజాయతీగా ఆసక్తి చూపేవారందరూ మరోసారి చర్చలకు మద్దతు ఇస్తారని ఆశిస్తున్నట్లు లావ్రోవ్ పేర్కొన్నారు. యుద్ధం ముగింపు కోసం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరుదేశాలపై ఒత్తిడి తేవడంతో తుర్కియే
వేదికగా ఈ నెల 16న ఇరుదేశాల ప్రతినిధుల మధ్య చర్చలు జరిగాయి. పలు అంశాలపై చర్చించారు. అయితే కాల్పుల విరమణకు సంబంధించి ఎలాంటి పురోగతి లభించలేదు. ఈ నేపథ్యంలో మే 19న ట్రంప్, పుతిన్ ఫోన్
కాల్లో దాదాపు రెండు గంటలకుపైనే మాట్లాడుకున్నారు. అనంతరం పుతిన్ స్పందిస్తూ భవిష్యత్తు శాంతి ఒప్పందానికి సంబంధించి ఉక్రెయిన్తో కలిసి పనిచేయడానికి సంసిద్ధత వ్యక్తం చేశారు. ఓవైపు శాంతి చర్చల
మంతనాలు కొనసాగుతుండగానే ఉక్రెయిన్పై రష్యా అతిపెద్ద గగనతల దాడి చేసింది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ సహా పలు ప్రాంతాలపై 69 క్షిపణులు, 298 డ్రోన్లు ప్రయోగించింది. ఈ ఘటనలో 12 మంది మృతి చెందారు.
పలు భవనాలు నేలమట్టం అయ్యాయి. దీనిపై ట్రంప్ స్పందిస్తూ పుతిన్ పూర్తిగా పిచ్చిపట్టినట్లు ప్రవర్తిస్తున్నట్లు మండిపడ్డారు. మరోవైపు ఉక్రెయిన్లోని నాలుగు గ్రామాలను రష్యా ఆక్రమించినట్లు
అధికారులు తెలిపారు.