Play all audios:
ఇంటర్నెట్ డెస్క్: అప్పటికే మిట్ట మధ్యాహ్నం..ఆకలి ఎక్కువగా ఉండటంతో పుణెకు చెందిన శ్రీపాల్ గాంధీ జొమాటోలో పనీర్ టిక్కా శాండ్విచ్, చిప్స్, ఓట్ రైసిన్ కుకీస్ ఆర్డర్ పెట్టాడు. కాసేపటికి
ఫుడ్ చేతికి అందింది. తినాలని ఆబగా తెరిచేలోపు పాకెట్లో చిప్స్, కుకీస్ లేకపోవడంతో నిరాశతో ఈ సమస్యను డెలివరీ ఏజెంట్కు చెప్పాడు. అయితే అతడు సదరు రెస్టారంట్ను సంప్రదించాలని సూచించాడు. వారికి
కాల్ చేయగా జొమాటో ఏజెంట్ను తిరిగి పంపితే..ఆర్డర్ ప్రకారం రాని పదార్థాలను తిరిగి పంపుతామని..మళ్లీ తీసుకువచ్చినందుకు ఏజెంట్కు రూ.20 ఇవ్వాలని సూచించారు. అతడు డెలివరీ ఏజెంట్కు కాల్ చేసి
ఈ విషయం చెప్పడంతో అతడు మళ్లీ రెస్టారంట్కు వెళ్లి మిస్ అయిన పదార్థాలు తీసుకువచ్చి ఇచ్చారు. అదనంగా రూ.20 ఇస్తున్నప్పటికీ వాటిని తిరస్కరించాడు. సాధారణంగా జొమాటో చెప్తే గానీ సంస్థ ఏజెంట్లు
తిరిగి ఆర్డర్ కోసం రెస్టారంట్లకు వెళ్లరు..అలాంటిది కంపెనీ చెప్పకపోయినా..ఇది తన బాధ్యతగా భావించి మిస్ అయిన రెండు ఆహార పదార్థాలను తీసుకువచ్చాడు. ఇదే విషయాన్ని శ్రీపాల్ ఏజెంట్ను అడగాగా తాను
కష్టసమయంలో ఉన్నప్పుడు ఆదుకున్న సంస్థకు చెడ్డ పేరు రావద్దనే ఉద్దేశంతోనే ఈ విధంగా చేశానని సమాధానమిచ్చాడు. అతడి గురించి పూర్తిగా తెలుసుకున్నాక డెలివరీ ఏజెంట్ కేవలం భోజనమే కాదు..జీవిత
సారాంశాన్ని తనకు ‘డెలివరీ’ చేశాడని గుర్తించానని పేర్కొంటూ.. శ్రీపాల్ సోషల్ మీడియాలో ఓ సుదీర్ఘ పోస్ట్ పెట్టాడు. అదేంటంటే? ప్రస్తుతం జోమాటో డెలివరీ ఏజెంట్గా పని చేస్తున్న వ్యక్తి గతంలో
భవన నిర్మాణ పర్యవేక్షకుడిగా పని చేసేవాడు. నెలకు లక్ష రూపాయల జీతం, భార్యా పిల్లలతో జీవితం సాఫీగా సాగిపోతున్న సమయంలో ఒక్కసారిగా కుదుపు. ఉద్యోగానికి వెళ్తున్న సమయంలో కారు ప్రమాదానికి గురవడంతో
శరీరంలోని ఎడమ వైపు భాగం చచ్చుబడిపోయింది. దాని వల్ల అతడి ఉద్యోగం పోయింది. తీవ్ర ఆర్థిక సమస్యల్లో చిక్కుకున్న కుటుంబాన్ని గట్టెక్కించాలంటే ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి. కానీ తనకు ఉన్న సమస్యకు
ఎక్కడా ఉద్యోగాలు దొరకలేవు. అప్పుడే జొమాటోలో దివ్యాంగులకు కూడా సంస్థ ఉద్యోగావకాశాలు ఇస్తుందని తెలియడంతో వారిని సంప్రదించగా..డెలివరీ ఏజెంట్గా ఉద్యోగం ఇచ్చారు. దాంతో ఆయన తన కుటుంబాన్ని
పోషించుకుంటున్నాడు. ఆ జీతంతోనే తన కుమార్తెను ‘డెంటిస్ట్రీ’ చదివిస్తున్నట్లు తెలిపాడు. తాను దివ్యాంగుడు అయినప్పటికీ కష్టసమయంలో తన కుటుంబాన్ని ఆదుకున్న సంస్థకు ఎప్పుడూ రుణపడి ఉంటానని..అన్నం
పెట్టిన సంస్థకు చెడ్డపేరు రాకుండా చూసుకోవడం తన బాధ్యత అని అతడు చెప్పిన మాటలు తనకు ఎంతో గొప్ప జీవిత సత్యాన్ని తెలిపాయని శ్రీపాల్ సోషల్ మీడియాలో పేర్కొన్నాడు. ఎన్ని కష్టాలు వచ్చినా ఆయన
జీవితాన్ని నిందించలేదు.. ఎవరిపైనా ఫిర్యాదులు చేయలేదు.. సాకులూ చెప్పలేదు.. చిరు నవ్వుతో ఆ భగవంతుడు నాకు తోడుండగా నేనెందుకు ఆందోళన చెందాలి అని అన్నాడని శ్రీపాల్ రాసుకొచ్చారు. ఇటువంటి వారికి
ఉద్యోగాలు ఇచ్చి..ఎన్నో కుటుంబాలు గౌరవంగా బతికేలా చేస్తున్న జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్కు కృతజ్ఞతలు తెలిపారు. దీంతో డెలివరీ ఏజెంట్ నిజాయితీని, నైతిక విలువలను నెటిజన్లు కొనియాడుతున్నారు.