Play all audios:
హైదరాబాద్: పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముంది. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ
కేంద్రం వెల్లడించింది. మంగళవారం ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్తోపాటు రాజన్న సిరిసిల్ల, మెదక్, సంగారెడ్డి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముంది. ఆయా
జిల్లాల్లో ఎల్లో హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు సముద్రమట్టానికి 7.6కి.మీ ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, ఎత్తు పెరిగే కొద్దీ దక్షిణ దిక్కుకు వాలి ఉందని వాతావరణ శాఖ తెలిపింది. బుధవారం
జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, జనగాం జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముంది. ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. గురువారం ఖమ్మం, భద్రాద్రి
కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు తెలిపింది. గంటలకు 40 కి.మీ ఉనంచి 50 కి.మీ వేగంతో ఈదురుగాలు వీచే అవకాశమున్నట్లు పేర్కొంది.
రాగల మూడు రోజులు గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 5 నుంచి 7 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశముంది.