Play all audios:
ముంబయి: భారత టెస్టు క్రికెట్లో కొత్త శకం ప్రారంభమైంది. సుదీర్ఘ ఫార్మాట్లో రోహిత్ శర్మ వారసుడిగా యువ ఆటగాడు శుభ్మన్ గిల్ను బీసీసీఐ ఎంపిక చేసింది. అందరూ భావించినట్లుగానే టెస్టు జట్టు
కెప్టెన్సీ పగ్గాలను గిల్కు అప్పగించింది. ఈ మేరకు వచ్చే నెలలో ఇంగ్లాండ్ పర్యటనకు టీమ్ఇండియా జట్టును బీసీసీఐ శనివారం ప్రకటించింది. సారథిగా శుభ్మన్ గిల్, వైస్ కెప్టెన్గా రిషభ్ పంత్ను
తీసుకుంది. మొత్తం 18 మంది ఆటగాళ్లతో జట్టును ప్రకటించింది. జూన్ 20 నుంచి ఇంగ్లాండ్తో ఐదు టెస్టుల సిరీస్ జరగనుంది. టీమ్ ఇండియా జట్టు ఇదే.. శుభ్మన్ గిల్ (కెప్టెన్). రిషభ్ పంత్ (వైస్
కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీశ్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్
ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, ఆకాశ్ దీప్, అర్ష్దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్. కోహ్లీ స్థానంలో ఆ ఇద్దరిలో ఒకరు.. సాయి సుదర్శన్, అర్ష్దీప్ సింగ్ ఈ సిరీస్తోనే
టెస్టుల్లో ఎంట్రీ ఇవ్వనున్నారు. ఇక, కరుణ్ నాయర్ 8 ఏళ్ల తర్వాత సుదీర్ఘ ఫార్మాట్లో అడుగుపెడుతున్నాడు. చివరిసారిగా అతడు 2017 మార్చిలో టెస్టు మ్యాచ్ ఆడాడు. టెస్టు ఫార్మాట్కు కోహ్లీ
రిటైర్మెంట్ ఇవ్వడంతో నంబరు 3లో ఎవరు వస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఆ స్థానంలో సాయి సుదర్శన్ లేదా కరుణ్ నాయర్ను తీసుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి. గాయంతో బాధపడుతున్న షమీతో పాటు శ్రేయస్
అయ్యర్, సర్ఫరాజ్ ఖాన్కు జట్టులో చోటు దక్కలేదు.