Play all audios:
ఇంటర్నెట్ డెస్క్: మూడేళ్ల క్రితం కెనడా నుంచి అమెరికా (USA)లోకి అక్రమంగా ప్రవేశించేందుకు ఓ భారతీయ కుటుంబం చేసిన ప్రయత్నం విషాదాంతమైంది. సరిహద్దుల్లో తీవ్రమైన మంచు తుపాను కారణంగా చలికి గడ్డ
కట్టి ఆ కుటుంబమంతా దుర్మరణం పాలైంది. వీరి మృతితో ఓ అంతర్జాతీయ మానవ అక్రమ రవాణా నెట్వర్క్ బయటపడింది. ఆ ముఠాను నడిపిస్తున్న భారతీయుడు హర్షకుమార్ పటేల్ అలియాస్ ‘డర్టీ హ్యారీ’ (Indian human
smuggler Dirty Harry)కి తాజాగా అమెరికా కోర్టు జైలు శిక్ష విధించింది. హర్షకుమార్ పటేల్ను 2024 ఫిబ్రవరిలో చికాగోలోని అంతర్జాతీయ ఎయిర్పోర్టు నుంచి అరెస్టు చేసి కస్టడీలోకి తీసుకున్నారు.
పటేల్, ఫ్లోరిడాకు చెందిన ఆంటోనీ షాండ్ కలిసి ఈ మానవ అక్రమ రవాణా నెట్వర్క్ను నడుపుతున్నారని విచారణలో గుర్తించారు. విద్యార్థి వీసాలపై పదుల సంఖ్యలో భారతీయులను కెనడాకు రప్పించి.. అక్కడి నుంచి
వారిని అక్రమంగా అమెరికా సరిహద్దులు దాటిస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. 2022 జనవరిలో ఇలాగే ఓ గుజరాతీ కుటుంబం సహా మరో ఏడుగురిని అమెరికా-కెనడా సరిహద్దు (US-Canada Border) వద్దకు తీసుకొచ్చారు.
ఆ సమయంలో విపరీతంగా మంచు కురిసింది. దీంతో గుజరాతీ కుటుంబం మంచులో కూరుకుపోయింది. మరో ఏడుగురు నడుచుకుంటూ సరిహద్దును దాటినప్పటికీ కేవలం ఇద్దరు మాత్రమే ఆంటోనీ షాండ్ ఏర్పాటుచేసిన వ్యాన్ వద్దకు
చేరుకోగలిగారు. వారిని తీసుకొని అమెరికాలోకి వెళ్తుండగా.. భద్రతా సిబ్బంది అడ్డుకొని షాండ్ను అరెస్టు చేశారు. ఆ తర్వాత తీగ లాగితే ‘డర్టీ హ్యారీ’ వ్యవహారం బయటపడింది. దీంతో వీరిద్దరిని అరెస్టు
చేసి కేసు నమోదు చేశారు. తాజాగా విచారణ జరిపిన న్యాయస్థానం డర్టీ హ్యారీని దోషిగా తేలుస్తూ 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది. షాండ్కు ఇంకా శిక్ష ఖరారు చేయలేదు. మంచులో కూరుకుపోయి దారుణమైన
స్థితిలో.. షాండ్ను అరెస్టు చేసిన రోజే.. సరిహద్దుకు కొంత దూరంలో కెనడా వైపు నాలుగు మృతదేహాలను కనుగొన్నట్లు రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీసులు.. యూఎస్ బోర్డర్ పెట్రోలింగ్ అధికారులకు
సమాచారమిచ్చారు. సరిహద్దుకు 12 మీటర్ల దూరంలో మంచులో కూరుకుపోయి అత్యంత దారుణమైన స్థితిలో ఈ మృతదేహాలు కన్పించాయి. మృతులను భారత్లోని గుజరాత్కు చెందిన జగదీశ్ బల్దేవ్భాయ్ పటేల్ (39), ఆయన
భార్య వైశాలిబెన్ (37), కుమార్తె విహంగి జగదీశ్ కుమార్ పటేల్ (11), కుమారుడు ధార్మిక్ జగదీశ్ కుమార్ పటేల్ (3)గా గుర్తించారు. ఈ ఘటన అప్పట్లో తీవ్ర చర్చనీయాంశమైంది.