Play all audios:
ఇంటర్నెట్డెస్క్: ‘ఆపరేషన్ సిందూర్’(Operation Sindoor)ను పకడ్బందీ ప్రణాళిక ప్రకారం నిర్వహించినట్టు ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ (Air Chief Marshal AP Singh) వెల్లడించారు. యుద్ధంలో ఆధునిక
సాంకేతికత, స్వదేశీ పరిజ్ఞాన వినియోగం గురించి మాట్లాడుతూ ఈ వ్యాఖ్య చేశారు. ఈ సందర్భంగా ఆయన ఒక సినిమా డైలాగ్ వాడటంతో సభా ప్రాంగణం అంతా చప్పట్లతో మారుమోగింది. గురువారం దిల్లీలో జరిగిన ఓ
కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. స్వదేశంలో తయారు అయిన రక్షణ సామగ్రిని వినియోగించాలని భారత్ దృఢ సంకల్పంతో ఉందని వాయుసేన దళపతి అన్నారు. అప్పుడే.. ‘ఒక్కసారి కమిటైతే నా మాట నేనే వినను’ అని ఒక ఫేమస్
సినిమా డైలాగ్ను ప్రస్తావించారు. ‘‘రక్షణరంగానికి చెందిన పరికరాలు తయారు చేసే కంపెనీలకు, బలగాలకు మధ్య పరస్పర అవగాహన ఉండాలి. మేకిన్ ఇండియా ఉత్పత్తుల వాడకాన్ని పెంచడానికి మేం మావంతు
ప్రయత్నిస్తున్నాం’’ అని అన్నారు. ఆపరేషన్ సిందూర్ దేశ విజయం అని తెలిపారు. ఈ ఆపరేషన్ విజయవంతం కావడానికి సహకరించిన ప్రతి భారతీయుడికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఇదే సమావేశంలో రక్షణ శాఖ మంత్రి
రాజ్నాథ్ సింగ్ మాట్లాడారు. ఆయన కూడా స్వదేశీ తయారీ గురించే మాట్లాడారు. పీఓకే గురించి ప్రస్తావించారు. ‘‘భౌగోళికంగా విడిపోయినా పీవోకే ప్రజలు రాజకీయంగా ఏదో ఒకరోజు భారత్లో ఏకమవుతారు. ఆ రోజు
ఎంతో దూరంలో లేదు. పీఓకే దానంతట అదే తిరిగి వస్తుంది. అక్కడున్నవారికి భారత్తో సన్నిహిత సంబంధాలున్నాయి. గ్రేట్ ఇండియా మా సంకల్పం. అక్కడ కొందరు మాత్రమే తప్పుదారి పట్టారు. మనం ఏమైనా
చేయగలిగేవాళ్లం. అయితే శక్తితో పాటు సంయమనం కూడా ముఖ్యం. ఆపరేషన్ సిందూర్ ద్వారా దేశభద్రతకు మేకిన్ ఇండియా ముఖ్యమని రుజువైంది’’ అని అన్నారు.